నేడు నరసరావుపేటలో పాదయాత్ర చేయనున్న చంద్రబాబు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. నేడు నరసరావుపేటలో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. నేడు నరసరావుపేటలో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.
అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు… నేడు నరసరావుపేటలో పాదయాత్ర చేయనున్నారు. నగరంలో పాదయాత్ర ముగిసిన తర్వాత పల్నాడ్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం(జనవరి 11,2020) తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. ‘మానవ ప్రయత్నం ఎంత ఉన్నా దేవుడి ఆశీస్సులు లేకుంటే ఏమీ చేయలేము. తిరుపతిలో స్వామివారి పాదాల చెంతనున్న మనం.. రాజధానిగా అమరావతి కొనసాగేలా ఆశీర్వదించమని ప్రార్థిద్దాం’అని కోరారు. ‘సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? నేను తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా. నాడు హైదరాబాద్ను కాదని తిరుపతికి తెచ్చానా? హైదరాబాద్లాంటి రాజధాని ఇంకోటి కట్టాలనుకోవడం నా తప్పా? నేను తప్పు చేశానని మీరు భావిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా’ అని చంద్రబాబు అన్నారు.
మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. తుళ్లూరులో రైతుల మహాధర్నాలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను కూడా లెక్క చేయకుండా నిరసనలు కొనసాగించారు. మా భూములిచ్చాం రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు. తుళ్లూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతుల్లో ఓ అన్నదాత ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో… పోలీసులు అలర్ట్ అయ్యి రైతును అడ్డుకున్నారు.