వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్, రైతులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

రైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేయనుంది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్లలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించనున్నారు. ఇందుకోసం 197 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వం నాబార్డు సమర్పించింది. దీంతో నాబార్డు ఆర్ఐడీఎఫ్ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది.
నకిలీ, నాసిరకం విత్తనాలు, పురుగు మందులకు చెక్:
ఏటా నకిలీ విత్తనాలు, నాసిరకమైన ఎరువులు, పురుగుమందులతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. నకిలీలను నివారించేందుకు అధికారులు ఎంత నిఘా పెట్టిన అక్రమార్కులు వాటిని కొత్త దారుల్లో ఎప్పటికప్పుడు రైతాంగానికి అంటగడుతూనే ఉన్నారు. ఫలితంగా రైతులు పంట దిగుబడినే కోల్పోవడమే కాకుండా ఆర్థికంగానూ చితికిపోతున్నారు. దీన్ని గమనించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పంటల అమ్మకం కష్టం కాకూడదు:
మరోవైపు పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడకూడదని, వారు ఎక్కడా రోడ్డెక్కే పరిస్థితి కనిపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రాష్ట్రంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై శుక్రవారం(జూలై 24,2020) క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని పంటలకు మార్కెటింగ్ లేక కనీస గిట్టుబాటు ధరలు రాని అంశాన్ని స్వయంగా జగన్ ప్రస్తావించారు. ఈ సీజన్ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలని, దీని కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.
”పంటలకు తగిన మార్కెటింగ్ లేక, కనీస గిట్టుబాటు ధరలు రాక ఏటా అరటి, చీని, టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, మిర్చి తదితర పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు అమ్ముకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయా పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలి. మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి”-సీఎం జగన్.