Anam RamNarayana Reddy: తిరుపతి ఘటన.. జగన్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో క్లారిటీగా చెప్పిన మంత్రి ఆనం
Anam RamNarayana Reddy: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

Minister Anam RamNarayana Reddy
Minister Anam RamNarayana Reddy : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంకా దుష్ట చతుష్టయాన్ని పెట్టుకొని ఊరేగుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. తిరుమలలో తొక్కిసలాట ఘటనకు కారణాలు.. గాయపడిన వారిని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో జగన్, ఆ పార్టీ నేతల వ్యవహారశైలి తదితర విషయాలపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Also Read: Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి
కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లనే..
రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. అంతేకాక.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అప్పటికప్పుడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో టీటీడీకి సంబంధించి పర్యవేక్షణ చేయాల్సిన సంయుక్త కార్య నిర్వహణ అధికారి గౌతమి సక్రమంగా విధులు నిర్వహించలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో జేఈవోను ప్రశ్నించారు. దర్శన టోకెన్ల కౌంటర్లను సక్రమంగా పర్యవేక్షించలేదు. కౌంటర్ల వద్ద ఇంచార్జ్ గా ఉన్న పోలీస్ అధికారి కూడా విధుల్లో లేరు. అందువల్లే కొందరు అధికారులను బదిలీ చేయడంతో పాటు ఇద్దరిని సస్పెండ్ చేశారు.
Also Read: Gossip Garage : కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో మార్పు కనిపిస్తుందా?
జగన్ అహంకార దర్పాన్ని ప్రదర్శించాడు..
వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లను తిరుమల నుంచి కిందికి ఎందుకు మార్చారనికూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారని ఆనం రామనారాయణ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడాలేని జగన్ బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి వచ్చారు. ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని.. ఆయన వెళ్లిన తర్వాత రమ్మని జగన్ కు అధికారులు సూచించారు. కానీ, జగన్ అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వందలాది మంది ఆసుపత్రిలోకి వచ్చారు. ఐసీయూ రూములలోకి వెళ్ళవద్దని డాక్టర్లు వారిస్తున్నా వాళ్ళని ఖాతరు చేయలేదు. ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు ఐసీయూ ప్రోటోకాల్ గురించి తెలియదా.. అంటూ మంత్రి ఆనం రాంనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Gossip Garage : రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్న వైసీపీ నేత ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
ప్రభుత్వాన్ని తిట్టాలని కవర్లు ఇచ్చారు..
జగన్ చెప్పిన సమయం కంటే ఆలస్యంగా వచ్చారు. అయినా అధికారులు ఆయనకు సహకరించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. పేషెంట్ లకు పెట్టిన సెలైన్ బాటిళ్లను కూడా తోసేశారు. ఇలా వ్యవహరించడం సరికాదు. జగన్ నిన్న దుష్ట చతుష్టయ యాత్రను చేశారు. జగన్ వచ్చేముందే 18 మంది బాధితులకు ఒక వ్యక్తి తెల్ల కవర్లు అందజేశారు. జగన్ వస్తున్నారు.. ప్రభుత్వ వైఫల్యం అని చెప్పండని వారికి సూచించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో తెల్ల కవర్లు ఇచ్చినట్లు రికార్డు అయింది. బాధితులను పరామర్శించకుండా ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఈ అవకాశాన్ని తీసుకున్నారంటూ ఆనం విమర్శించారు.
ఎన్నికల్లో ప్రజలు జగన్ కు గుణపాఠం చెప్పినా ఆయనలో మార్పు రాలేదు. ఇంకా ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకొని ఊరేగుతున్నారు. ఈ సమాజంలో వీళ్ళు ఉండదగిన వాళ్ళు కాదు. శవాల మధ్యలో వైసీపీ నేతలు పేలాలు ఏరుకున్నారు. అందుకే ప్రజలు వీరికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హైందవ సమాజం పట్ల గౌరవం లేదు. సనాతన ధర్మంపై విశ్వాసం లేదు అంటూ జగన్ పై ఆనం మండిపడ్డారు.