సరసమైన ధరలకే మద్యం..! ఏపీలో అమల్లోకి రానున్న కొత్త లిక్కర్ పాలసీ
త్వరలో తీసుకురాబోయే నూతన లిక్కర్ పాలసీలో 3వేల 396 దుకాణాలను నోటిఫై చేయబోతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు నోటిఫై చేయబోతున్నారు.

Ap New Liquor Policy : ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రాబోతోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మద్యం పాలసీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2019 కంటే ముందున్న లిక్కర్ పాలసీనే తిరిగి ప్రవేశపెట్టబోతోంది ఏపీ సర్కార్.
త్వరలో తీసుకురాబోయే నూతన లిక్కర్ పాలసీలో 3వేల 396 దుకాణాలను నోటిఫై చేయబోతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు నోటిఫై చేయబోతున్నారు. వీటన్నింటికి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని వ్యక్తి అయినా నిర్దేశిత రుసుమును చెల్లించి వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లోంచి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించబోతున్నారు అధికారులు.
ఇక వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు నిర్వహించే అధికారాన్ని ఎక్సైజ్ చట్టాన్ని సవరించి ప్రభుత్వమే చేసేలా చట్టం చేసింది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోయే లిక్కర్ పాలసీలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలంటే దీనికి చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి దాదాపు 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంది.
Also Read : ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం
ఇక రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకురాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఆమోద్యయోగమైన కొత్త మద్యం విధానం తీసుకొస్తామన్నారు. దీని కోసం ఇప్పటికే సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్న మంత్రి.. నెలాఖరులోపు నాణ్యమైన, ఆరోగ్యకరమైన లిక్కర్ బ్రాండ్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సరసమైన ధరలకే మద్యాన్ని సరఫరా చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.