Pawan Kalyan: ఆ రోజు నేను నోరు విప్పి ఉంటే ఇతడు ఉండేవాడు కాదు: పవన్ కల్యాణ్
తాను ఆవేశంగా మాట్లాడటం లేదని, ఆలోచించి మాట్లాడుతున్నానని తెలిపారు.
Pawan Kalyan – JanaSena : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ(Kakinada)లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ వారాహి విజయ యాత్ర నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy) ఇంటి దగ్గర నిరసనకు వెళ్తే, ఆ ఎమ్మెల్యే రౌడీలు దాడి చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. తమ నాయకులు పంతం నానాజీ, సందీప్ పంచకర్లతో పాటు ఇతర నాయకులు, మహిళల మీద దాడులు చేశారని అన్నారు.
తాను ఢిల్లీ నుంచి కాకినాడకు వస్తే ఇక్కడ 144 సెక్షన్ పెట్టారని తెలిపారు. ” ఆ రోజు నేను నోరు ఇప్పి ఉంటే ఈ డెకాయిట్ చంద్రశేఖరరెడ్డి ఉండేవాడు కాదు ” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏం చేయాలని నిలదీశారు. అయితే, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సి ఉంటుందని చెప్పారు.
క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే..
తమ పడుచులను చంద్రశేఖర్ రెడ్డి కొట్టించాడని, ఆయన ఓ విషయం గుర్తు పెట్టుకోవాలని.. నేటి నుంచి, ఆయన పతనం మొదలైందని అన్నారు. ఆయన క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే తన పేరు పవన్ కల్యాణ్ కాదు, తన పార్టీ జనసేనే కాదని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే చాలా దిగజారుడు మాటలు తిడుతుంటారని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఆవేశంగా మాట్లాడటం లేదని, ఆలోచించి మాట్లాడుతున్నానని తెలిపారు. తన మాటలకు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రెండున్నర సంవత్సరాల క్రితం స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో, బాగా తాగి నోటికి వచ్చినట్లు మాట్లాడారని తెలిపారు.
మర్యాదగా ఉండదు జాగ్రత్త..
వైసీపీ వారు కులాలను విడదీస్తారని చెప్పారు. కులదూషణలతో రెచ్చగొడితే మర్యాదగా ఉండదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ద్వారంపూడి నేర సామ్రాజ్యం నడుపుతున్నారని చెప్పారు. సీఎం జగన్ అండ చూసుకుని అనేక దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వైసీపీ కరెక్ట్ కాదు అని తాను 2014లోనే చెప్పానని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పారు. కులాల వారిగా విభజిస్తామంటే తాను ఊరుకునే వ్యక్తిని కాదని హెచ్చరించారు. రాష్ట్రంలో భద్రత ఉండాలని, కులాల మధ్య చిచ్చుపెట్టకూడదని అన్నారు. జనవాణిలో ప్రజల సమస్యలు వింటుంటే చాలా బాధ వేసిందని తెలిపారు.