ఆ ప్రాంతంలోని టీడీపీలో ముదురుతున్న ముసలం.. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న నేతలు.. ఎందుకంటే?

ఎన్నికలప్పుడు సొంత పార్టీ వాళ్లే వెన్నుపోట్లు పొడిచినా..తట్టుకుని నిలబడ్డానని..అభివృద్ధికి అడ్డుగా ఉంటే..తొక్కుకుంటూ ముందుకు వెళ్తానంటూ.. బొల్లినేని రామారావును ఉద్దేశించి పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు ఎమ్మెల్యే కాకర్ల.

ఆ ప్రాంతంలోని టీడీపీలో ముదురుతున్న ముసలం.. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న నేతలు.. ఎందుకంటే?

Updated On : December 23, 2025 / 9:19 PM IST

TDP: నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం..పొలిటికల్‌గా ఎప్పుడూ పెద్ద రచ్చ లేని ప్రాంతం. ఎవ‌రు గెలిచినా..ప్రశాంతంగా ప‌నిచేసుకుంటూ పోవడం ఇక్కడి నేతల స్టైల్. ఎన్నికలకు ముందు ఒకరంటే ఒకరికి గిట్టకపోయినా తర్వాత క‌లిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రశాంత‌మైన ఉదయగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రాజ‌కీయ సెగ కాక రేపుతోంది. అభివృద్ధిని అడ్డుకుంటే..తాట‌తీస్తానంటూ..ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్..ఎవరి పేరు తీయకుండా..వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును ఉద్దేశించే..ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇండైరెక్ట్‌ కామెంట్స్ చేశారంటూ చ‌ర్చ సాగుతోంది.

బడా కాంట్రాక్టర్ అయిన బొల్లినేని రామారావు 2014లో ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఉదయగిరి టీడీపీ టికెట్‌ ఆశించారు. అయితే ఎలక్షన్స్ సమయంలో వస్తారు..గెలిచినా.. ఓడినా.. ఆ తర్వాత కనిపించరంటూ బొల్లినేనిపై విమర్శలున్నాయి.

ప్రజలకు అందుబాటులో ఉండకుండా కాంట్రాక్టులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తారని ఆరోపణలున్నాయి. అప్పట్లో బొల్లినేని రామారావు గ్రాఫ్ కూడా పాజిటివ్‌గా లేకపోవడంతో..గత ఎన్నికల్లో ఉదయగిరి సీటు కాకర్ల సురేష్‌కు ఇచ్చారు టీడీపీ అధినేత. 2024లో టికెట్ ఆశించి భంగపడ్డ బొల్లినేని రామారావు..టీడీపీలోనే ఉన్నప్పటికీ యాక్టీవ్ రోల్‌ ప్లే చేయడం లేదు.

Also Read: వాటర్ వార్‌తో కేసీఆర్ ప్లాన్.. రేవంత్‌ కౌంటర్‌ ఆపరేషన్.. సిట్‌ నుంచి నోటీసులు, అసెంబ్లీలో చర్చ

అంతర్గతంగా బొల్లినేని రామారావు, కాకర్ల సురేష్‌కు గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల్లో కాకర్ల సురేష్‌తో కలిసి పనిచేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినా..బొల్లినేని రామారావు బేఖాతరు చేశారన్న విమర్శలున్నాయి. ఎలక్షన్స్ ముందు ఇద్దరి నేతల మధ్య నడిచిన గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందట. ఇటీవల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేసిన వ్యాఖ్యలే వీరి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టాయి.

కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ..
ప్రతి నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తుంటే తనపై కొంతమంది కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతన్నారు కాకర్ల సురేష్. తనపై లేనిపోని అలిగేషన్స్‌ చేస్తున్నవారికి ధీటుగా సమాధానం చెప్తానంటున్నారు ఎమ్మెల్యే.

అలాగే ఎన్నికలప్పుడు సొంత పార్టీ వాళ్లే వెన్నుపోట్లు పొడిచినా..తట్టుకుని నిలబడ్డానని..అభివృద్ధికి అడ్డుగా ఉంటే..తొక్కుకుంటూ ముందుకు వెళ్తానంటూ.. బొల్లినేని రామారావును ఉద్దేశించి పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు ఎమ్మెల్యే కాకర్ల. ఇప్పటికే ఈ 18 నెలల్లో 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశానంటున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేని అంశాల్లో బద్నాం చేస్తున్నారని..ఇలాంటివన్నీ తన దగ్గర కుదరవని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

లేటెస్ట్‌గా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేప‌ట్టారు. అయితే..కాంట్రాక్టర్ల విష‌యంలో మ‌రో వివాదం తెర‌మీదకి వ‌చ్చింది. బొల్లినేని వ‌ర్గానికి చెందినవారికి ప‌నులు ఇచ్చేది లేద‌ని ఎమ్మెల్యే వ‌ర్గం చెబుతోంది. దీంతో పొరుగు ప్రాంతాల‌కు చెందిన వారిని తెచ్చి కాంట్రాక్టు ప‌నులు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్లను బొల్లినేని వ‌ర్గం బెదిరింపుల‌కు గురి చేసింద‌న్న ఆరోపణలున్నాయి. ఇలా ఎమ్మెల్యే కాకర్ల, బొల్లినేని మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు నాయ‌కులు టీడీపీలోనే ఉన్నా..అంత‌ర్గత కుమ్ములాట‌లు పెర‌గ‌డంతోనే..ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బ‌హిరంగ వార్నింగులు ఇచ్చార‌న్నది ప్రస్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ. మ‌రి ఇది స‌ద్దుమణుగుంతా.? లేదా.? అనేది చూడాలి.