విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా, అయినా వాహనాలకు అనుమతి

  • Published By: naveen ,Published On : September 17, 2020 / 01:45 PM IST
విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా, అయినా వాహనాలకు అనుమతి

Updated On : September 17, 2020 / 3:53 PM IST

విజయవాడలో రేపు(సెప్టెంబర్ 18,2020) జరగాల్సిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్లైఓవర్‌ ప్రారంభ వేడుకలకు హాజరుకావాల్సిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా పాజిటివ్‌ రావడంతో… ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌ ద్వారా విషయాన్ని తెలియజేశారు. ప్రారంభోత్సవం జరగకపోయినప్పటికీ… ప్రజావసరాల దృష్ట్యా ఫ్లైఓవర్‌పై రేపటి నుంచి ట్రాఫిక్‌ వదలడం జరుగుతుందన్నారు.

విజయవాడ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. కనకదుర్గ ఫ్లైవవర్ రేపటి నుంచి నగరావాసులకు అందుబాటులోకి రాబోతోంది. శుక్రవారం నుంచి ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు ఎంపీ కేశినేని నాని. వాస్తవానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కనక దుర్గ ఫ్లైవర్‌ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ప్రారంభోత్సవం వాయిదా పడినప్పటికీ రేపటి నుంచే కనక దుర్గ ఫ్లైఓవర్ నుంచి వాహనాలను రాకపోకలకు అనుమతించనున్నారు.

అసలు సెప్టెంబర్ 4నే దుర్గగుడి ఫ్లెఓవర్‌ను ప్రారంభించాలని గతంలో అధికారులు నిర్ణయించారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు సంతాప దినాలు ఉన్నందున ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. తర్వాత సెప్టెంబర్ 18న ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పుడు నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో.. మళ్లీ వాయిదా పడింది.

కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగరవాసులు దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి కావడంతో ఎట్టకేలకు విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో 50 శాతం ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దుర్గగుడి ఫ్లైఓవర్ తమ వల్లే సాధ్యమైందని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు క్రెడిట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు హయంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి గాలికొదిలేశారని.. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే దుర్గగుడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేశామని అంటున్నారు. ఈ క్రెడిట్ సీఎం జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు.


https://10tv.in/is-cm-jagan-next-target-tdp-leader-devineni-uma/
ఆరేళ్లుగా నత్తనడకన సాగిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులు నెల రోజుల క్రితమే పూర్తయ్యాయి. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి కేంద్ర రవాణామంత్రి నితిన్‌ గడ్కరీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.