వామ్మో రూ.3 కోట్లు దోచేశారు : డెబిట్ కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: డెబిట్ కార్డులు క్లోనింగ్ చేసి డబ్బులు కొట్టేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. 10 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా జార్ఖండ్కు చెందిన వాళ్లు. డెబిట్ కార్డులు క్లోనింగ్ చేసి డబ్బు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి కార్డుల ద్వారా రూ. 3 కోట్లు దండుకున్నట్లు గుర్తించారు. ఒక్క రోజులోనే 3 లక్షల కాల్స్ వచ్చాయంటూ ఐసీఐసీఐ బ్యాంకు రీజనల్ మేనేజర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.
నిందితులు రెడ్ బస్ యాప్లోని అప్లికేషన్లో 3 లక్షల నెంబర్లను ర్యాండమ్గా కొట్టి.. వాటి డాటా తీసుకుని.. వాటిలో 3వేల 500 కార్డుల వివరాలు సేకరించి నకిలీ కార్డులు తయారు చేశారు. వెయ్యి కార్డులకు చెందిన రూ.3 కోట్లను 12 రాష్ట్రాలు తిరిగి నకిలీ కార్డుల ద్వారా డబ్బులు విత్ డ్రా చేశారు. నిందితులు జార్ఖండ్ రాష్ట్రం జంతారా జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కొత్త తరహా పద్దతిలో బ్యాంకులనే మోసం చేశారని సీపీ వివరించారు. ఒకే నెంబర్ నుంచి మళ్లీ మళ్లీ ఫోన్ కాల్స్ వస్తే ఆ నెంబర్ను బ్లాక్లో పెట్టాలని బ్యాంకర్లకు సీపీ సూచించారు. నిందితుల దగ్గర నుంచి ఏటీఎం కార్డులు, స్వైపింగ్ యంత్రం, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.