జనవరి 08 నుండి జేఈఈ మెయిన్స్ పరీక్షలు
రేపట్నించి నాలుగురోజులపాటు జేఈఈ మెయిన్స్ పరీక్షలు

రేపట్నించి నాలుగురోజులపాటు జేఈఈ మెయిన్స్ పరీక్షలు
హైదరాబాద్: రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీ,ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు 4రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్లైన్లో ప్రతిరోజూ రెండు షిఫ్ట్లుగా నిర్వహిస్తారు. దేశంలోని 263 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరవుతుండగా, తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు పరీక్షరాస్తున్నారు.
పరీక్షకు నియమ నిబంధనలు
విద్యార్దులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండదని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్కు బదులు రెండు షిఫ్ట్లలో లేదా వేర్వేరు రోజుల్లో రెండుస్లారు పరీక్ష పరీక్ష రాసినా వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని, వారి ఫలితాలను లెక్కలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని పేర్కొంది.
ఎక్కడెక్కడ పరీక్ష కేంద్రాలు
తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి చొప్పున జేఈఈ మెయిన్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించగా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెలలో మొదటి విడత పరీక్షను నిర్వహిస్తోంది. మొదటి విడత నిర్వహించే పరీక్ష ఫలితాలను ఈ నెల 31న ప్రకటిస్తారు…..రెండో విడత పరీక్షను ఏప్రిల్లో నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు.