2023 Assembly Polls: సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా.. వెంటనే ఢిల్లీకి మోగిన ఫోన్లు, చివర్లో అదిరిపోయే ట్విస్ట్
ఆగస్టు 17న 39 స్థానాలకు బీజేపీ తొలి జాబితా విడుదల కాగా, రెండో జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రెండో జాబితా ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఏ వార్త వచ్చినా ఆశావాహుల గుండె దడదడలాడుతోంది

MP Assembly Polls: మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల రెండవ జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది తప్పుడు సమాచారమని, పార్టీ ఇంకా అలాంటిదేమీ విడుదల చేయలేదని మధ్యప్రదేశ్ బీజేపీ యూనిట్ బుధవారం పేర్కొంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదలైంది. అయితే ఆ జాబితాలో జబల్పూర్ తూర్పు స్థానం నుంచి అంచల్ సోంకర్ పేరు ఖరారైంది. అయితే రెండవ జాబితాలో ఆ పేరు మార్చడంతో ఇది తప్పుడు సమాచారమని నెటిజెన్లు ఇట్టే చెప్తేస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీజేపీ క్యాంపులో కలకలం నెలకొంది.
బుధవారం అకస్మాత్తుగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితా జబల్పూర్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభమైంది. ఈ జాబితాలో, జబల్పూర్ తూర్పు అభ్యర్థి అంచల్ సోంకర్ స్థానంలో మరో అభ్యర్థి రాజేంద్ర చౌదరి పేరు చేర్చబడింది. అలాగే, జబల్పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఉన్న మాజీ ఐఏఎస్ వేద్ ప్రకాష్ పేరును కూడా ప్రకటించారు. అదేవిధంగా జబల్పూర్ నార్త్ స్థానం నుంచి సందీప్ జైన్ పేరు కూడా జాబితాలో ఉంది.
ఆగస్టు 17న 39 స్థానాలకు బీజేపీ తొలి జాబితా విడుదల కాగా, రెండో జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రెండో జాబితా ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఏ వార్త వచ్చినా ఆశావాహుల గుండె దడదడలాడుతోంది. ప్రతి చిన్నదానికి భోపాల్ నుంచి ఢిల్లీకి ఫోన్లు మోగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంతో ఫోన్ల రాయబారం పెద్ద ఎత్తున సాగిందట. కానీ ఏప్రిల్ ఫూల్స్గా మారారని తర్వాత తెలిసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభ్యర్థుల జాబితా నకిలీదని బీజేపీ నేత ప్రభాత్ సాహు పేర్కొన్నారు. పార్టీ నుంచి ఇంకా కొత్త జాబితా విడుదల కాలేదన్నారు. సోషల్ మీడియాలో నకిలీ జాబితాను ఎవరో దుష్ప్రచారం చేశారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఈసారి మూడు నాలుగు సార్లు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి జాబితా విడుదలైన తర్వాత, ఇప్పుడు రెండవ జాబితాను సెప్టెంబర్ 5 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. రెండో జాబితాలో 60 మందికి పైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చు.