పక్కా స్కెచ్.. ట్రాప్ చేసి, ప్రియాంక రెడ్డి ముక్కు మూసేసి చంపేశారు: సజ్జనార్

  • Published By: vamsi ,Published On : November 29, 2019 / 02:41 PM IST
పక్కా స్కెచ్.. ట్రాప్ చేసి, ప్రియాంక రెడ్డి  ముక్కు మూసేసి చంపేశారు: సజ్జనార్

Updated On : November 29, 2019 / 2:41 PM IST

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై కీలక విషయాలని వెల్లడించారు సీపీ సజ్జనార్. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు తెలిపారు. ప్రియాంక రెడ్డిపై సామూహిక లైంగికదాడి, హత్య పథకం ప్రకారమే నలుగురు చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రియాంకను అటకాయించి, సాయం చేస్తున్నట్టు నటించి ఆమెపై మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యానికి ఒడికట్టినట్లు చెప్పారు సీపీ సజ్జనార్.

ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు అవ్వగానే పోలీసులు అలర్ట్ అయ్యారని, మృతదేహం దొరికిన తర్వాత 10టీమ్‌లు సెర్చ్ చేసి నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు సజ్జనార్. అన్నీ పోలీస్ స్టేషన్లు వెంటనే అలర్ట్ అయ్యాయని తెలిపారు. ఎప్పటిలాగే బుధవారం కూడా ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా వద్దకు వచ్చారని, అక్కడ బండి పార్క్ చేసి క్యాబ్‌లో వెళ్లారని, తిరిగి వచ్చేలోపు ఆమెను అప్పటికే చూసిన మహ్మద్ పాషా అండ్ కో బండి పంక్చర్ చేశారని చెప్పారు.

మాదాపూర్‌లో ట్రీట్‌మెంట్ ముగించుకుని తిరిగొచ్చిన ప్రియాంక.. వెనక టైర్ పంక్చర్ కావడం చూసి షాక్ అయ్యిందని, అప్పటికే చీకటి పడిపోవడం.. ఇంతలో సాయం చేస్తామని మహ్మద్ పాషా అండ్ కోం రావడంతో అమాయకంగా నమ్మిందని సజ్జనార్ వివరించారు. వారి ప్రవర్తనపై ప్రియాంకకు అనుమానం వచ్చినా ఏమీ చేయలేకపోయిందని చెప్పారు. పాషా అండ్ కో సాయంత్రం 5 గంటల నుంచి ఫుల్లుగా మద్యం సేవించినట్లు సజ్జనార్ తెలిపారు. 

ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయని, క్లూస్ సంపాదించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు సజ్జనార్. మహిళలు,వృద్దులు ఎవరైనా ఆపదలో ఉంటే 100కి వెంటనే ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు సజ్జనార్. నలుగురు నిందితుల్లో  ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్ అని తెలిపారు. ఏ2 శివ, ఏ3 జొల్లు నవీన్ క్లీనర్లు ఇద్దరు ఉన్నారు. ఏ4 చెన్న కేశవులు. నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని చెప్పారు సజ్జనార్. వీరంతా మక్తల్ మండల్‌కి చెందిన వ్యక్తులని చెప్పారు.

వెహికల్ అన్‌లోడ్ చేయవలసి ఉండగా.. రిసీవర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో లారీ అక్కడ పెట్టుకున్నారని, అదే టైమ్‌లో ప్రియాంక రావడం చూసి స్కెచ్ వేసినట్లు చెప్పారు. నలుగురు కూడా రేప్ చేసే సమయంలో నోటిని, ముక్కును మూసి వెయ్యడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు చెప్పారు సీపీ సజ్జనార్. తర్వాత ప్రియాంకను నిర్జీవ ప్రదేశంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పారు. స్కూటీని కూడా 10 కిలోమీటర్ల దూరంలో వదిలివేశారని వివరించారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆధారాలు సమర్పిస్తామని సీపీ సజ్జనార్ చెప్పారు.