అయోధ్య తీర్పు : హైదరాబాద్లో బలగాల మోహరింపు

134 సంవత్సరాల వివాదం..అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదుల స్థల వివాదం..కేసులో సుప్రీంకోర్టు కొద్ది గంటల్లో తీర్పును వెలువరించబోతోంది. ఎలాంటి తీర్పు వస్తుందోనని..దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. సున్నితమైన రాష్ట్రాల్లో భారీగా బలగాలను మోహరించింది. అయోధ్యతోపాటు..ఉత్తర్ ప్రదేశ్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా నిఘా..గస్తీ ముమ్మరం చేశారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో అప్రకటిత నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట..గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ సైతం శనివారం ఉండడంతో..20 వేల మందితో బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి పాక్షికంగా..శనివారం తెల్లవారుజామున నుంచి పూర్తి స్థాయిలో అదనపు బలగాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర హోం శాఖ సూచనల మేరకు..ఎక్కడా ఎలాంటి చిన్న ఘటన జరుగకుండా..పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసులకు తోడు..కేంద్రం నుంచి అదనపు బలగాలు తెప్పించే యోచనలో పోలీసు అధికారులున్నట్లు తెలుస్తోంది.
> 1992 డిసెంబర్ 6న ఓ వర్గం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టింది.
> ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా భావించారు.
> హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ముస్లిం రాజులు బాబ్రీ మసీదు కట్టారంటూ హిందువులు బాబ్రీ మసీదు కూలగొట్టారు.
> దేశంలో మత కల్లోలాలు చెలరేగగా.. దేశవ్యాప్తంగా అల్లర్లలో 2వేల మంది చనిపోయారు.
> ఇరు మతాలవారు కోర్టు మెట్లెక్కగా.. అయోధ్య వ్యవహారం చివరి అంకానికి చేరుకుంది.
> కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ముగిసి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
> నవంబర్ 17లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు భావించింది.
> సుప్రీం కోర్టు సీజేఐ రంజన్ గొగొయి పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది.
Read More : నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు