హైదరాబాద్‌లో జనవరి నుంచి కొత్త ట్యాక్స్

హైదరాబాద్‌లో జనవరి నుంచి కొత్త ట్యాక్స్

Updated On : October 16, 2019 / 5:09 AM IST

హైదరాబాద్‌లో జనవరి నుంచి పన్నుల్లో కొత్త విధానం రాబోతుంది. నిర్మితమై ఉన్న భవనాలను, కట్టడాలను సర్వే చేసి, వాస్తవానికన్నా తక్కువ చెల్లిస్తున్న వాటిని గుర్తించేందుకు హైదరాబాద్ నగర పాలక సంస్థ రంగం సిద్ధం చేసింది. పన్నుల నవీకరణలో భాగంగా నవంబర్ ఒకటో తేదీ నుంచి సీజీజీ( సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఆధ్వర్యంలో సర్వే మొదలుపెట్టనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎనిమిది వారాల్లోనే పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకు గత ఆర్థిక సంవత్సరానికి రూ. 1400 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్రక్రియ పూర్తి చేసి దానిని రూ.2వేల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 20లక్షలకు పైగా నిర్మాణాలున్న నగరంలో కేవలం 14.5లక్షల నిర్మాణాలకే పన్ను చెల్లిస్తున్నారు. అదనపు అంతస్తులకు, పెంచుకున్న విస్తీర్ణానికి చాలా మంది పన్ను చెల్లించకుండా గడిపేస్తున్నారు. 

వారిలో మరి కొందరు నివాసానికి పన్ను కడుతూ, వ్యాపార వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇళ్ల పేరుతో హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, గోడౌన్‌లు, నిర్వహిస్తున్నారు. ఉపయోగానికి తగ్గట్లు పన్ను విధించాలనేది సర్వే ఉద్దేశం. వీటన్నిటీని ఫీల్డ్ ఆఫీసర్లు గమనించినప్పటికీ బిల్ కలెక్టర్లకు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు సంవత్సనికోసారి ముడుపులు తీసుకుంటూ ఖజానాకు గండికొడుతున్నారు. ట్రాక్ అందించిన ఉపగ్రహ పటాలపై డాకెట్ల వారీగా సరిహద్దులు నిర్ణయించాం. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌లోని రెండు డాకెట్ల వివరాల్లో దోషాలు తలెత్తగా, ప్రస్తుతం వాటిని సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తయితే సీజీజీ సర్వేను ప్రారంభిస్తుందని తెలిపారు.