పోలీసులు అలర్ట్: హైదరాబాద్లో సిమీ ఉగ్రవాది అరెస్ట్

హైదరాబాద్ నగరంలో సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని అరెస్టు చేశారు పోలీసులు. శంషాబాద్ విమానాశ్రయంలో 2013లో జరిగిన బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల సంఘటనలతో అతనికి సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి హైదరాబాదులోని బంధువుల ఇంటికి రావడానికి విమానాశ్రయంలో దిగగా కెమికల్ అలీని చత్తీస్ఘఢ్ పోలీసులు అరెస్టు చేశారు.
అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీ రాయపూర్ లోని మౌధాపరాకు చెందినవాడు. ఆరేళ్లుగా అతను సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. సౌదీ అరేబియాలోని ఓ సూపర్ మార్కెట్లో అతను సేల్స్ మెన్గా.. డ్రైవర్గా పనిచేస్తూ తలదాచుకున్నాడు. ఈ క్రమంలో భారత్కు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎస్ అధికారులతో కలిసి అరెస్ట్ చేశారు.
హైదరాబాదులో అరెస్టు చేసిన అతనిని చత్తీస్ ఘఢ్కు తీసుకుని వెళ్లారు. కెమికల్ అలీ స్లీపర్ సెల్గా పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్లకు పాల్పడినవారికి అతను ఆశ్రయం కల్పించాడని పోలీసులు అంటున్నారు.
అతని నుంచి పాస్ పోర్టు, రెండు డ్రైవింగ్ లైసెన్సులు, ఓ వోటింగ్ పాస్, ఓ వోటర్ ఐడెంటిటీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. అయితే, అజహరుద్దీన్ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అయితే అలీ హైదరాబాద్ వస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యి అతనిని అరెస్ట్ చేశారు.