సునామీలో కొట్టుకుపోయిన భార్య కోసం పదేళ్లుగా సముద్ర గర్భంలో గాలింపు
జపాన్లో పదేళ్ల క్రితం జరిగిన సునామీలో భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచి భార్య కోసం వెదుకుతూనే ఉన్నాడు. ప్రళయం ధాటికి కనిపించకుండా పోయిందని ఫీల్ అవుతున్న ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని అందులో ఉంది.
Japan’s Tsunami: జపాన్లో పదేళ్ల క్రితం జరిగిన సునామీలో భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచి భార్య కోసం వెదుకుతూనే ఉన్నాడు. ప్రళయం ధాటికి కనిపించకుండా పోయిందని ఫీల్ అవుతున్న ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని అందులో ఉంది.
ఆ రోజు నుంచి భార్య కోసం వెదుకుతూనే ఉన్నాడు. తర్వాత ఒక్క సమాచారం కూడా అందుకోకపోయినా తిరుగుతూనే ఉన్నాడు. తన గురించి ఏదైనా విషయం తెలుస్తుందేమోనని ఆశతో బతుకుతున్నానని చెప్తున్నాడు 64ఏళ్ల యసువో తకామాట్సు.
జపాన్లోని ఒనగావాలో ఉంటున్న అతని భార్య యుకో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసేది. పదేళ్ల కిందట.. 2011, మార్చి 11న ఫుకుషిమాలో వచ్చిన భారీ భూకంపం వల్ల సునామీ విరుచుకుపడింది. ఆ ప్రళయం ధాటికి ఒనగావా పట్టణం అతలాకుతలం అయింది. రెప్పపాటులో జరిగిన విధ్వంసంలో ఎందరో జీవితాలు చెల్లాచెదురైపోయాయి.
సునామీ రోజున ఎప్పటిలాగే బ్యాంకుకు వెళ్లిన యసువో భార్య యసువో మొబైల్కు మెసేజ్ పంపింది. అది చూసి ఆమె ఇంకా జీవించే ఉందని అనుకున్నాడు. కానీ, తర్వాత ఆమె ఫోన్కు కాల్స్ వెళ్లలేదు. మెసేజ్ కూడా రాలేదు. మొబైల్, విద్యుత్ సేవలు నిలిచిపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుందని యసువో భావించాడు.
ఆమె బ్యాంక్ను ఆనుకుని ఉన్న ఎత్తైన కొండ ఎక్కి క్షేమంగా ఉండొచ్చని భావించాడు. సముద్రం వెనక్కి వెళ్లిన తర్వాత.. యసువో ఎంతో కష్టపడి బ్యాంక్ వద్దకు వెళ్లాడు. అతడి గుండె ఆగినంత పనైంది. అక్కడ బ్యాంక్ లేదు. మొత్తం ఆనవాళ్లు లేనంత విధ్వంసం జరిగింది. బ్యాంకు నుంచి ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపరని తెలుసుకున్న యసువో.. భార్య ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించాడు.
ఆ రోజు బ్యాంకు సిబ్బందిని కొండ మీదకు కాకుండా బిల్డింగ్ మీదకు పంపారని తెలిపాడు. అలల తీవ్రతకు బ్యాంకు కూడా కొట్టుకుపోయిందని చెప్పాడు. యసువో ఆశలు వదులుకోలేదు. ఆ రోజు నుంచి బ్యాంకు పరిసర ప్రాంతాలు, కొండ ఎగువ, దిగువ ప్రాంతాల్లో భార్య కోసం అన్వేషించాడు. సముద్ర తీరాల్లోనూ గాలించాడు. సుమారు మూడేళ్లు మొత్తం తీర ప్రాంతం, పట్టణాన్ని జల్లెడ పట్టాడు.
ప్రభుత్వం నిర్వహించిన సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ కనిపించకుండా పోయిన 2వేల 500 మంది ఆచూకీ తెలుసుకోడానికి కూడా ప్రయత్నించాడు. అలాగైనా తన భార్య ఆచూకీ తెలుస్తుందని ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు.
నేలపై ఆమె ఆచూకీ లభించే అవకాశం లేదని భావించి.. స్థానిక డైవింగ్ శిక్షణా కేంద్రానికి వెళ్లి శిక్షణ పొందాడు. వారంలో ఆరు రోజులు సముద్ర తీర ప్రాంతాల్లో.. ఒక రోజు సముద్రంలో డైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. సముద్రం అడుగున అణువణువు గాలిస్తున్నాడు. ఇప్పటివరకు తన భార్య ఆచూకీ లభించలేదు. పది మంది అస్థికలు వెలికి తీసి.. సంబంధిత కుటుంబికులకు అందించాడు. గాలింపుల్లో భార్యకు సంబంధించిన కొన్ని వస్తువులు, దుస్తులైతే అతడికి లభించాయి.
‘ఆఖరి మెసేజ్లో ఇంటికి వస్తానంది. ఏదో ఒక రోజు తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుందనే ఆశిస్తున్నాను. ఊపిరి ఉన్నంత వరకు శరీరం సహకరించినంత కాలం నా భార్య కోసం అన్వేషిస్తూనే ఉంటాను. ప్రస్తుతం పట్టణంలో సాధారణ స్థితి నెలకొంది. ఇక్కడి ప్రతి ఒక్కరి గుండె.. చేదు గుర్తులతో బరువెక్కి ఉన్నాయి’ అని తెలిపాడు.
ఆ రోజు సునామీ వల్ల గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన సముద్రపు అలలు 133 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డాయి. పది కిలోమీటర్ల వరకు ముంచెత్తడంతో సుమారు 15 వేల మంది చనిపోగా.. అణు విపత్తు వల్ల సుమారు 2.30 లక్షల మంది నిరాశ్రుయులయ్యారు. ఇతను నివసిస్తున్న సిటీలో 800 మందికి పైగా మరణించారు.