భారత్ లో ఉగ్రదాడులకు ఫ్లాన్…పాక్ జైలు నుంచి మసూద్ రిలీజ్

ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఈ ఏడాది మేలో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్ లో ఉగ్రకార్యకాలాపాలు నిర్వహించేందుకు మసూద్ ను… జైలు నుంచి రెండు రోజుల క్రితం పాకిస్తాన్ రహస్యంగా రిలీజ్ చేసిందని, భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్తాన్, సియోల్కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్.. అజార్ను విడుదల చేసి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది.
మసూద్ ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై భారత్ తో సహా ప్రపంచ దేశాలు పాక్పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాక్ కు నిద్రపట్టడం లేదు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. పాక్ మాటలకు భారత్ కూడా అదేరీతిలో ధీటైన సమాధానమే ఇచ్చింది. మరోవైపు ఆర్టికల్ 370రద్దు భారత్ అంతర్భాగ విషయమని ప్రపంచదేశాలు బహిరంగంగా ప్రకటించడంతో దిక్కుతోచని పాక్ యుద్ధం అంటూ పిచ్చి పలుకులు పలుకుతోంది.
పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్తో యుద్ధానికి కూడా సిద్ధం అంటూ పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ గెంతులేశారు. ఈ సమయంలో అంతర్జాతీయ ఉగ్రవాది అజార్ ను భారత్పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది.