Actor Ali : వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై నా దారి ఇదే..
వైసీపీకి సీనీ నటుడు అలీ గుడ్ బై చెప్పారు.
![Actor Ali : వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై నా దారి ఇదే.. Actor Ali : వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై నా దారి ఇదే..](https://10tv.in/wp-content/uploads/2024/06/Actor-Ali-resigns-YCP.jpg)
Actor Ali resigns YCP
వైసీపీకి సీనీ నటుడు అలీ గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్కు పంపారు. ఇక పై తాను ఏ పార్టీలోనూ ఉండబోనని, మరే పార్టీకి మద్దతు పలకబోనని చెప్పారు. ఇక నుంచి తాను ఓ నటుడిగానే కొనసాగుతానని వెల్లడించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు.
1999లో రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు అలీ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ తరువాత సెకండ్ ఇన్నింగ్స్కి అవకాశం ఇచ్చిన రామానాయుడి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో రామానాయుడు బాపట్ల ఎంపీగా నిలబడుతున్నానని చెప్పాడని, వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని అన్నారు. దాదాపు 20 ఏళ్లు ఆ పార్టీలో ఉన్నానని, ఆ తరవాత వైసీపీలో చేరినట్లు తెలిపారు.
తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని.. 45 ఏళ్లు ఆరు భాషలు 1200 పైచిలుకు సినిమాల్లో నటించానన్నారు. తనకు ఎంతో కొంత భగవంతుడు దయా గుణం ఇచ్చాడు, దానికి రాజకీయ బలంతోడైతే ఇంకా సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదన్నాడు.
Chiranjeevi : అందరికి చెప్పండి.. మార్పు తీసుకురండి.. ప్రభుత్వ లక్ష్యమదే : చిరంజీవి
‘మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి కరోనాలో కూడా ఆపకుండా 16 ఏళ్లుగా సేవ చేస్తున్నాను.. ఆ ట్రస్టు ద్వారా నేను ఎంతో మందిని చదివిస్తున్నాను. నా సంపాదనలో 20 శాతం ట్రస్ట్కు ఇస్తున్నాను. విదేశాల్లో ఈవెంట్స్ చేసినా కూడా ఆ రెమ్యునరేషన్ నుంచి 60 శాతం ఇస్తాను. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలను పొగుడుతాను కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు. ఈ మేరకు మీరు వెతకినా నేను ఎవర్ని అయినా దూషించిన వీడియో దొరకదు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను.. ఏ పార్టీ సపోర్టర్ ను కాను. ఇక మీదట నా సినిమాలు, నా షూటింగ్స్ నేను చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ‘అని అలీ వీడియోలో అన్నారు. తాను కూడా ఓ సామాన్యుడిలా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తానని చెప్పాడు. ఇకపై రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు.
కాగా.. 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. 2022లో అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా వైసీపీ ప్రభుత్వం నియమించింది. రెండుళ్లు ఆయన ఆ పదవిలో కొనసాగారు.