సాహో నిర్మాతలకు తెలంగాణలో షాక్: ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • Published By: vamsi ,Published On : August 25, 2019 / 09:34 AM IST
సాహో నిర్మాతలకు తెలంగాణలో షాక్: ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Updated On : August 25, 2019 / 9:34 AM IST

300కోట్ల బడ్జెట్‌తో భారీ నిర్మాణ విలువలతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఆగస్ట్ 30వ తేదీన విడుదల కాబోతున్న సాహో సినిమా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు సినిమా నిర్మాతలు విజ్ఞప్తి చేసుకున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు అనుమతి దొరికినా కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. గతంలో ‘బాహుబలి 2’ సినిమాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఏ సినిమాకు కూడా అటువంటి అవకాశం ఇవ్వలేదు.

అయితే లేటెస్ట్‌గా సాహో సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించిన క్రమంలో ఈ సినిమాకు అటువంటి అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. కానీ అందుకు తెలంగాణ ప్రభుత్వం సున్నితంగా నిరాకరించింది. ‘బాహుబలి 2’ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాకు కూడా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేసింది. ఒక్క సినిమాకు టిక్కెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలకు వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాహో సినిమా విడుదలైన తర్వాత మొదటి రెండు వారాల పాటు ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అంగీకరించింది. దీంతో రూ.100 టికెట్ రూ.200కు పెరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. బాహుబలి సినిమాకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది.