Mega and Allu Family: మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా?
మరోవైపు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం.

మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసిపోయాయా? వాళ్ల మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలకు ఇక చెక్ పడినట్లేనా..? అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్తో మెగా ఇంటి పోరు పేరుతో జరగుతున్న ప్రచారానికి ఫుల్స్టాప్ పడినట్లేనా.. టాలీవుడ్లో ఇప్పుడిదే హాట్ హాట్గా జరుగుతున్న చర్చ. ఇంతకీ మెగా, అల్లు ఫ్యాన్స్ ఎలా ఫీలవుతున్నారు.
కలిసి ఉంటేనే కలదు సుఖం. ఏ ఫ్యామిలీలో అయినా సంతోషంగా ఉండాలంటే ఐకమత్యం చాలా ముఖ్యం. అందుకే మన పెద్దలు ఐకమత్యమే మహాబలమని చెప్పారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క మెగా హీరోలంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్లు ఉంటారు. ఏ విషయంలోనైనా అంతా ఒకే తాటిపై నిలబడతారు. తమలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరు కదలివస్తారు.
అయితే కొన్నాళ్లుగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదంటూ ఫిలిం సర్కిళ్లల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాళ్ల అభిమానులైతే తమ సొంత ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయనే రేంజ్లో ఫ్యాన్ వార్స్తో సోషల్ మీడియాలో రచ్చ చేశారు.
అప్పుడు మాటల యుద్ధం
దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ మెగా హీరోలతో ఒకేచోట కలుసుకున్న సందర్భం కూడా లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్, మిగిలిన మెగా హీరోల కామెంట్స్ చూస్తే గొడవలే నిజమే కావచ్చు అనిపించేవి. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో ఈ రచ్చ పెద్ద దుమారంగా మారిపోయింది. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
అయితే ఆ గొడవలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. ఇటీవల పుష్ప-2 సినిమా రిలీజ్ టైమ్లో ఏపీలో టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పవన్ కల్యాణ్ ఎంతో హెల్ప్ చేశారు. అంతేకాదు పుష్ప విడుదల వేళ మెగా బ్రదర్ నాగబాబు, సాయి ధరమ్ తేజ్ విషెష్ కూడా చెప్పారు. పుష్ప సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ మళ్లీ మెగా ఫ్యామిలీతో కలిసిపోయారనే టాక్ మొదలైంది. ఆ తర్వాత సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ఈవెంట్ అల్లు అరవింద్ హాజరై మెగా ఫ్యాన్స్ను ఉత్సాహ పరిచేలా స్పీచ్ ఇచ్చారు.
అల్లు ఫ్యామిలీకి అండగా..
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరంజీవి కదిలివచ్చారు. అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఇది నిజంగానే హైలైట్ అనే చెప్పాలి. అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేశారు. ఆ వెంటనే నాగబాబు నడవడానికి ఇబ్బంది పడుతూనే బన్నీ ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం. ఇవన్నీ మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒక్కటే అనడానికి సంకేతమని టాలీవుడ్లో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. తమ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా.. కష్ట సమయాల్లో అందరం కలిసిపోతామనే సందేశం ఇచ్చారని అనుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలసి పోయాయని.. ఊహాగానాలకు చెక్ పడుతూ ఫ్యామిలీ ఇష్యూకు ఫుల్స్టాప్ పడినట్లేనంటున్నారు మెగా ఫ్యాన్స్.