కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు స్పీడప్ చేసిన కవిత.. ఆ నెలలోనే పార్టీ ప్రారంభం..! ఎందుకంటే?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ద్వారానే పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు.

కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు స్పీడప్ చేసిన కవిత.. ఆ నెలలోనే పార్టీ ప్రారంభం..! ఎందుకంటే?

Kavitha (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 9:19 PM IST
  • పార్టీ పేరుపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న కవిత
  • ఆగస్ట్‌లో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్న కవిత..!?
  • 2006 ఆగస్ట్‌లోనే జాగృతిని ప్రారంభించిన కవిత

Kavitha: కారు దిగిన కవితక్క.. ఎట్టకేలకు తన ఎమ్మెల్సీ రిసిగ్నేషన్‌ కూడా యాక్సెప్ట్ చేయించుకున్నారు. ఇక తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కసరత్తు స్పీడప్ చేశారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పిన కవిత..శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్లారు. అసెంబ్లీ ముందున్న గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి..కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ద్వారానే పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు. అయితే జాగృతి నేతల అభిప్రాయం తీసుకోగా..తెలంగాణ జాగృతి సంస్థని రాజకీయ పార్టీగా మార్చాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరికొందరు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో టీఆర్ఎస్ వచ్చేలా చూడాలని కవితను కోరినట్టు సమాచారం.

Also Read: ఏపీలో ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు లేనట్లేనా? అడ్డంకులు ఏంటి?

కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో..పాత టీఆర్ఎస్ పేరు..కవిత పార్టీలో ఉండేలా చూడాలని సూచించారట. ఇక కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2006 ఆగస్ట్‌లో తెలంగాణ జాగృతి సంస్థను కవిత ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని శాసనమండలిలో కవిత ప్రస్తావించారు. 20ఏళ్ల తర్వాత ఆగస్ట్‌లోనే కవిత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.

మంచిర్యాలలో జాగృతి జనం బాట ముగింపు సభ
జాగృతి జనం బాట ముగింపు సభను.. ఫిబ్రవరి నెలాఖరులో మంచిర్యాలలో పెద్దఎత్తున నిర్వహించేందుకు రెడీ అవుతోందట కవిత. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగానే కవిత మంచిర్యాలపై ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. గతంలో సింగరేణి కార్మిక విభాగంతో కలిసి పనిచేసిన అనుభవం కవితకు ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే కవిత మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

అయితే కవిత బీఆర్ఎస్‌ను వీడుతారని ప్రచారం జరిగినప్పుడే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది. కవిత రాజకీయ పార్టీ పెడుతారని..ఆ తర్వాత కాంగ్రెస్‌లో కలుపుతారని..జస్ట్ లైక్ షర్మిల లాగా కవిత పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. లేటెస్ట్‌గా అటుఇటుగా ఇలాంటి స్టేట్‌మెంటే ఇచ్చారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. కవిత అంశంపై బీఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయినప్పుడే ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలే కవిత చేరికను అడ్డుకున్నారని..లేకపోతే ఇప్పటికే ఆమె కాంగ్రెస్‌లో చేరిపోయేవారనే చర్చ ఉంది. అయితే పార్టీ పెట్టాక ఆమె కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారా..లేక ఒంటరి పోరే సాగిస్తారా అన్నది వేచి చూడాలి.