Steal Clothes : మనుషులేనా.. మృతదేహాలపై కప్పిన దుస్తులు దొంగిలించి వాటికి లేబుల్ వేసి అమ్మేస్తున్నారు
మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో నీచానికి ఒడిగడుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డమైన పనులు చేస్తున్నాడు. తాజాగా ఓ ముఠా చేసిన పాడు పని సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? వీళ్లసలు మనుషులేనా? అనిపించింది.

Steal Clothes
Steal Clothes : మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో నీచానికి ఒడిగడుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డమైన పనులు చేస్తున్నాడు. తాజాగా ఓ ముఠా చేసిన పాడు పని సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? వీళ్లసలు మనుషులేనా? అనిపించింది. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసా… శ్మశానవాటికలు, దహనవాటికల్లో మృతదేహాలపై కప్పిన దుస్తులను దొంగిలిస్తారు. వాటికి లేబుల్స్ వేస్తారు. తిరిగి మార్కెట్ లో అమ్మేస్తారు. అలా సొమ్ము చేసుకుంటారు.
మృతదేహాలపై కప్పిన బట్టలను శ్మశానవాటికలు, దహనవాటికల నుంచి దొంగిలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని భాగ్పాట్లో ఈ ఘటన జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు చనిపోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఇది వెలుగులోకి రావడం కలకలం రేపింది.
చనిపోయిన వారి మృతదేహాలపై కప్పిన దుస్తులను శ్మశానవాటికలు, దహనవాటికల నుంచి దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు భాగ్పాట్ సర్కిల్ పోలీస్ అధికారి అలోక్ సింగ్ ఆదివారం(మే 9,2021) తెలిపారు. 520 బెడ్షీట్లు, 127 కుర్తాలు, 52 తెల్ల చీరలతోపాటు ఇతర దుస్తులు, వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటిని ఉతికి, ఇస్త్రీ చేసి గ్వాలియర్ కంపెనీ లేబుల్తో మార్కెట్లో అమ్ముతారని అలోక్ సింగ్ వివరించారు. స్థానిక వస్త్ర వ్యాపారులతో వీరికి సంబంధం ఉందని, శ్మశానవాటికల నుంచి దుస్తులను సేకరించేందుకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తారని వెల్లడించారు. ఈ ముఠాలోని ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని, గత పదేళ్లుగా వీరు ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనంతో పాటు కరోనా చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. చివరకు ఈ నీచులు మృతదేహాలతో కూడా వ్యాపారం చేస్తున్నారని తెలిసి అవాక్కవుతున్నారు. ఇలాంటి నీచానికి ఒడిగట్టిన వస్త్ర వ్యాపారులను వెంటనే గుర్తించి వారందరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.