బాత్ బీహార్ కీ…నితీష్ పై పీకే పొలిటికల్ వార్

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2020 / 09:35 AM IST
బాత్ బీహార్ కీ…నితీష్ పై పీకే పొలిటికల్ వార్

Updated On : February 18, 2020 / 9:35 AM IST

ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్పించిన ప్రశాంత్ కిషోర్…నితీశ్ కుమార్‌ పాలనకు వ్యతిరేకంగా,కొత్త నాయకత్వం కోసం 1కోటిమంది యువతే టార్గెట్ గా ‘‘బాత్ బీహార్ కీ’’ పేరుతో రాష్ట్రంలో సరికొత్త ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఈ నెల 20న తన ప్రచారం అవుతుందని పీకే తెలిపారు. రాబోయే 100 రోజుల్లో బీహార్ అంతటా పర్యటించి నితీశ్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగతానని ఆయన ప్రకటించారు. నూతన బీహార్‌ను నిర్మించేందుకు ‘బాత్ బీహార్ కీ ’ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నానని అని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిలో అట్టడుగున ఉండే బీహార్ కాకుండా సరికొత్త బీహార్‌ను కోరుకునే వాళ్లందర్నీతాను ఆహ్వానిస్తున్నానని పీకే తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లబోవడం లేదని, బీహార్ కోసం పనిచేసేందుకు అంకితమవుతానని ఆయన తెలిపారు. అభివృద్ధిలో బీహార్ ప్రస్తుతమున్న 22వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరేలా బీహార్ అభివృద్ధి చెందడం చూడాలనుకుంటున్నట్లు పీకే తెలిపారు. టాప్ 10 రాష్ట్రాల్లో బీహార్‌ను నిలపాలనుకుంటున్నాను.

బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు నితీశ్ కుమార్ పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీపడ్డారంటూ పీకే విరుచుకుపడ్డారు. బీహార్ అభివృద్ధి చెందిందంటూ ముఖ్యమంత్రి నితీశ్ పేర్కొనడంపైనా ధ్వజమెత్తారు. బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ఎంతో చేశారనీ.. అయినా రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని ఆయన గుర్తుచేశారు. చదువుకున్న యువకులు జీవోనోపాధి కోసం రాష్ట్రం విడిచి వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

గత 15 ఏళ్లలో నితీశ్ నాయకత్వంలో బీహార్‌లో చాలా అభివృద్ధి జరిగింది. కానీ ఆయన పెట్టుకున్న కొత్త స్నేహం ఏమైనా సాయం చేసిందా? నితీశ్ ఇప్పుడు గాడ్సే సిద్ధాంతాలను నమ్మే వాళ్ల పంచన చేరారు. పార్టీ సిద్ధాంతంపై నాకు, నితీశ్‌కు మధ్య చాలా సార్లు చర్చలు జరిగాయి. గాంధీజీ సిద్ధాంతాలను పార్టీ ఎప్పుడూ విడిచిపెట్టదని నితీశ్ మాతో చెప్పారు. కానీ ఇప్పుడు గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సేపై మెతకవైఖరి చూపించే పార్టీలతో ఆయన  పొత్తుపెట్టుకున్నారు. గాంధీ, గాడ్సే ఎప్పటికీ కలవరని పీకే తెగేసి చెప్పారు.

2005లో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉందనీ… ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతున్నదన్నారు. ఒక్క జార్ఖండ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే బీహార్ వెనుకబడి ఉంది. లాలూ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందంటూ మీరు  అడుగుతున్నారు. గత 15 ఏళ్లుగా మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలతో పోల్చితే మీరేం అభివృద్ధి సాధించగలిగారు?’అని సీఎం నితీశ్‌ను పీకే ప్రశ్నించారు.

నితీశ్ కుమార్ నన్ను కొడుకులా చూసుకుంటారు. నేను కూడా ఆయనను ఎప్పుడూ తండ్రిలానే భావిస్తాను. ఇక పార్టీలోకి తీసుకోవాలా లేదా బహిష్కరించాలా అన్నది నితీశ్ కుమార్ ఇష్టం. ఆయనపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై కేంద్ర ప్రభుత్వానికి నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మద్దతు ఇవ్వడంపై ఇద్దరికీ నితీష్-పీకేల ఇటీవల పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎసిపోడ్ లో బహిరంగంగా మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు గుప్పించినందుకు పీకేను పార్టీ నుంచి నితీష్ బహిష్కరించిన విషయం తెలిసిందే.