వలస కార్మికులపై చిన్నచూపు… రైల్వే అధికారి సస్పెండ్

రైల్వే స్టేషన్లో విధుల్లో ఉండి వలస కార్మికులను అపహస్యం చేసిన ఒక అధికారిని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లో చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టికెట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దీక్షిత్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
మే 25వ తేదీన వలస కార్మికులతో నిండిన శ్రామిక్ రైలు ఫిరోజాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరటానికి సిధ్ధంగా ఉంది. ఆ సమయంలో దీక్షిత్ తన టీం సభ్యులతో కలిసి కార్మికులను కించపరుస్తున్నట్లుగా….బిస్కట్ ప్యాకెట్లను కిటికీల్లోంచి, గేట్ లోంచి లోపలికి విసురుతూ, తన పుట్టినరోజు అని, బిస్కట్లు పంచుకుని తినాలని అపహస్యం చేస్తూ బిస్కట్ పాకెట్లు ప్రయాణికులపైకి విసిరేశాడు. .
ఈ తతంగం అంతా ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం ఈ వీడియో వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి రైల్వే శాఖ అధికారుల దృష్టిలోకి వెళ్లింది. క్రమ శిక్షణా చర్యల్లో భాగంగా అధికారులు దీక్షిత్ పై వేటు వేశారు. ఈఘటనలో అతని టీం సభ్యులు కూడా సస్పెండ్ అయ్యారు.