Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి స్వల్ప ఊరట
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Lalu Prasad Yadav
Land For Job Case : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. రైల్వే ఉద్యోగాలకోసం భూములు తీసుకున్నారనే ఆరోపణల కేసులో కోర్టు లాలూతో పాటు వారి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది. 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని అభియోగాలపై లాలూతో పాటు మరో 15 మందిపై గతేడాది మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కొద్ది వారాలకే ఈ కేసు నమోదవడం గమనార్హం.
గతేడాది అక్టోబర్ లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలి ఛార్జిషీట్ ను దాఖలు చేయగా.. 2023 జూలై 3వ తేదీన మరో ఛార్జ్ షీట్ ను సమర్పించింది. సెప్టెంబర్ 22న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. అయితే, లాలూ ప్రసాద్ ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ పై న్యాయమూర్తి జస్టిస్ గీతాంలి గోయల్ విచారణ జరిపారు. విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also : NASA: చంద్రుని దక్షిణ ధృవంపైకి వ్యోమగాములు.. వారు నివసించేందుకు ఇళ్లు కూడా..!
లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఇదే కేసులో ఆయన సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతీలకు కూడా ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 16న జరగనుంది.