Delhi liquor scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు

Delhi liquor scam: ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీబీఐ, ఈడీ విచారించింది. ఈ కేసులో అనేక కొత్త విషయాలు బయటపడ్డాయి.

Delhi liquor scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు

Arvind Kejriwal

Updated On : April 14, 2023 / 6:38 PM IST

Delhi liquor scam: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు గురించి కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేజ్రీవాల్ ను సీబీఐ ఇవాళ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో జైలులో ఉంటూ ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విచారణ ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవలే ఈడీ ప్రశ్నించింది. ఢిల్లీలో అసలు లిక్కర్ స్కాం జరగలేదని కేజ్రీవాల్ అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ గురించి ఇవాళ కూడా కేజ్రీవాల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. “భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందకూడదని భావిస్తాయి.

దేశంలోని పేదలు, దళితులకు నాణ్యమైన విద్య అందకూడదని అనుకుంటాయి. ఆ శక్తులే మనీశ్ సిసోడియాను జైలుకు పంపాయి. ఆయనను జైలుకు పంపిన వారు దేశానికి శత్రువులు” అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం జరగలేదని, కుట్రపూరితంగానే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలకు పాల్పడుతోందని ఆప్ నేతలు అంటున్నారు. సీబీఐ, ఈడీని వాడుకుంటూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని కేంద్ర సర్కారు భావిస్తోందని విమర్శలు చేస్తున్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణ.. ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఆరా