First phase elections : బెంగాల్ లో 5, అస్సాంలో 12 జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్..ఓటర్ ఎటువైపు
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.
Bengal, Assam : బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు. ఇన్ని రోజులు దిగ్గజాలు చేసిన ప్రచారాలు ఏమేర ప్రభావం చూపాయో తేల్చనున్నారు బెంగాల్, అస్సాం ఓటర్లు. బెంగాల్లో తొలి దశ జరుగుతున్న 30 అసెంబ్లీ స్థానాల్లో మైకులు మూగబోయాయి. ఇన్నాళ్లు తమ మాటలు, విమర్శలతో హీటెక్కించిన నేతలు.. ప్రచార సమయం ముగియడంతో ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. సినిమా డైలాగ్లు, సీన్లను తలదన్నేలా నడిచింది.. బెంగాల్ మొదటి విడత పోలింగ్.
బెంగాల్లో ఐదు జిల్లాల్లో 30 శాసన సభ స్థానాలకు తొలి దశలో మార్చ్ 27న పోలింగ్ జరగనుంది.. పశ్చిమ మిడ్నాపూర్, తూర్పు మిడ్నాపూర్, బంకురా, జార్గ్రామ్, పురులియా జిల్లాల్లో ఫస్ట్ ఫేస్ పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆఖరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు బీజేపీ, టీఎంసీ నేతలు.. చివరి రోజు బీజేపీ తరఫున ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొన్నారు… జాయ్పూర్, తాల్డాగ్రా, కాక్ద్వీప్, నియోజకవర్గాల్లో రాజ్ నాథ్ ర్యాలీ కొనసాగనుంది. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం నిర్వహించారు. మరోవైపు మమత బెనర్జీ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు..
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 30 నియోజకవర్గాల్లో 2016లో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా… కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది. అయితే ఈ సారి కూడా 27 సీట్లు దక్కించుకోవాలని టీఎంసీ వ్యూహం రచించింది. ఏదేమైనా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పేలిన తూటాలు.. హ్యాట్రిక్ సాధించాలని మమత పడిన ఆరాటం.. బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ వేసిన ఎత్తులన్ని బెంగాల్ ప్రజలు చూశారు.. ఇక తమ తీర్పును మార్చ్ 27న ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
మరోవైపు అస్సాంలో కూడా మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.. అస్సాంలోని 12 జిల్లాల్లోని 47 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 267 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.. ఈ ఎన్నికల కోసం 11 వేల 537 పోలింగ్ బూత్లను ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది.