బోర్డర్ లో బలగాల ఉపసంహరణకు భారత్-చైనా అంగీకారం

  • Published By: venkaiahnaidu ,Published On : June 23, 2020 / 11:39 AM IST
బోర్డర్ లో బలగాల ఉపసంహరణకు భారత్-చైనా అంగీకారం

Updated On : June 23, 2020 / 11:39 AM IST

భారత్-చైనా మధ్య సైనిక చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. బోర్డర్ లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ముందడుగు వేశాయి. సోమవారం జరిగిన ఇరు దేశ సైనిక ఉన్నతాధికారుల భేటీలో… తూర్పు లడఖ్ లో ఉద్రిక్తతలు తగ్గించేలా సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

భారత్, చైనా లెఫ్టినెంట్​ జనరల్స్ మధ్య సోమవారం చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌ చుశూల్‌ సెక్టార్‌లోని మోల్డో దగ్గర  జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సైనిక వర్గాల సమాచారం. LAC వెంబడి ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా దాదాపు 11 గంటలపాటు జరిగిన ఈ భేటీలో భారత్​ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్​ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్​ లియూ లిన్​ పాల్గొన్న విషయం తెలిసిందే. 

ఇరుదేశాల ఉన్నత సైనికాధికారుల మధ్య స్నేహపూర్వక, సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇద్దరు సైనికాధికారులు పరస్పర అంగీకారానికి వచ్చారు. తూర్పు లడఖ్ ​లోని అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. భారతదేశం శాంతిని కోరుకుంటుందని, కానీ చైనీయులను రెచ్చగొడితే ప్రతీకారం తీర్చుకుంటుంది అని సమావేశం తరువాత భారత వర్గాలు తెలిపాయి.

గల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ దాడిని చైనా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినట్లు భారత్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని భేటీలో భారత్​ బృందం ప్రధానంగా ప్రస్తావించింది.ఈ నేపథ్యంలోనే తూర్పు లడఖ్ లోని  అన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా బృందాన్ని డిమాండ్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా సరిహద్దు స్థావరాల వెనుక మోహరించిన బలగాలనూ తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పిందని తెలిసింది. 

చైనా ప్రకటనఉన్నత సైనికాధికారుల భేటీలో సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​ వెల్లడించారు. అయితే వాటికి సంబంధించిన సమాచారం తన వద్ద లేదని తెలిపారు. దౌత్య, సైనిక చర్చల మార్గంలోనే వివాద పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గల్వాన్ ఘర్షణల్లో చైనా వైపు 40 మందికిపైగా మృతి చెందారన్న వార్తల్లో నిజం లేదని లిజియాన్ పేర్కొన్నారు. ఘర్షణలో మృతుల సంఖ్యకు సంబంధించి చైనా స్పందించటం ఇదే తొలిసారి. 

నాలుగు ప్రాంతాల్లో..భారత్​-చైనా మధ్య తాజా సరిహద్దు ఉద్రిక్తతలు మే నెల మొదటివారం నుంచి ప్రారంభమయ్యాయి. తూర్పు లడఖ్, సిక్కింలోని నాలుగు ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో చైనాకు దీటుగా బలగాలను తరలించింది భారత్. భారీ సంఖ్యలో వాయుసేనను కూడా మోహరించింది.

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో జూన్​ 6న ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి చర్చలు జరిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. చైనా ఉల్లంఘనతో..గల్వాన్​లో జూన్ 15న ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో భారత్​కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు.76మంది భారత్ సైనికులు గాయపడ్డారు.  చైనా వైపున 40 మందికి మరణించినట్లు వార్తలు వచ్చిన.. 20 మందిలోపే చనిపోయారని తాజాగా వెల్లడించింది డ్రాగన్ దేశం