CJI Justice BR Gavai: సీజేఐపై దాడికి యత్నం ఘటన.. జస్టిస్ గవాయ్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
CJI Justice BR Gavai: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు.

PM Modi calls BR Gavai
CJI Justice BR Gavai: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడ్ని అడ్డుకున్నారు. ఈ ఘటనపై గవాయ్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని అన్నారు. అనంతరం ఆయన తన విచారణను కొనసాగించారు. అయితే, ఈ ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ పై ఒక న్యాయవాది షూ విసిరేందుకు ప్రయత్నించిన ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. తాను సీజేఐతో మాట్లాడానని.. అలాంటి చర్యలకు సమాజంలో స్థానం లేదని నొక్కి చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా మోడీ ఈ చర్యను ఖండించారు. “ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి ఖండించదగిన చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు జస్టిస్ గవాయ్ ప్రదర్శించిన ప్రశాంతతను నేను అభినందించాను. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను హైలైట్ చేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable.
I appreciated the calm displayed by Justice…
— Narendra Modi (@narendramodi) October 6, 2025
71 ఏళ్ల న్యాయవాది సీజేఐ గవాయ్పై ఓ కేసు విచారణ సమయంలో న్యాయవాది షూ విసిరాడు. మధ్యప్రదేశ్లో దెబ్బతిన్న విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించడం గురించి దాఖలైన పిటిషన్ను విచారిస్తున్నప్పుడు, “దేవుడిని స్వయంగా అడగండి” అని చేసిన వ్యాఖ్యలకు చీఫ్ జస్టిస్ విమర్శలు ఎదుర్కొన్న వారాల తర్వాత ఈ దాడి జరిగింది.
ఈ వ్యవహారంలో సంబంధిత న్యాయవాది రాకేశ్ కిశోర్ లైసెన్సును ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ రద్దు చేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.