Olympics Contingent To Red Fort : పంద్రాగస్టున ఎర్రకోట అతిథులుగా ఒలింపిక్ బృందం!
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Olympics Contingent To Red Fort ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆ సమయంలో వారందరితో వ్యక్తిగతంగా ప్రధాని మోదీ భేటీకానున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఎర్రకోట వద్ద ఆగస్టు-15 వేడుకలను సాదారణంగానే నిర్వహించనున్నారు.
జులై-23న ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ఆగస్టు-8న ముగియనున్న విషయం తెలిసిందే. కాగా,ఈసారి టోక్యో ఒలింపిక్స్కు భారత్ భారీ సంఖ్యలో అథ్లెట్లను పంపింది. సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వీరితో పాటు వంద మంది కోచ్లు, అసిస్టెంట్ సిబ్బంది టోక్యో వెళ్లిన భారత ఒలింపిక్ బృందంలో ఉన్నారు.
ఇవాళ ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈసారి భారీ సంఖ్యలో భారత బృందాన్ని ఒలింపిక్స్ పంపినట్లు చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘనత సాధించడం అద్వితీయమన్నారు. అనేక క్రీడల్లో మొదటిసారి క్వాలిఫై అయ్యామని, అర్హత సాధించడమే కాదు, గట్టి పోటీ ఇస్తున్నామని తెలిపారు. ఈ ఒలింపిక్స్లో ప్రతి ఆటలోనూ భారత ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. మన ఆటగాళ్లు తమకన్నా మేటి ర్యాంక్లో ఉన్నవారి పోరాడుతున్నట్లు చెప్పారు. భారతీయ క్రీడాకారులు ఆత్మవిశ్వాసం, దీక్ష, ఉత్సాహం చాలా ఉన్నతంగా ఉన్నట్లు తెలిపారు. సరైన ట్యాలెంట్ను గుర్తించి, ప్రోత్సహిస్తే ఇలాంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని ప్రధాని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ టీమ్ ఓటమిపై కూడా ప్రధాని స్పందించారు.జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగం..టోక్యో ఒలింపిక్స్లో మన హాకీ జట్టు బాగా ఆడడానికి ప్రయత్నించింది. తదుపరి మ్యాచ్తో పాటు భవిష్యత్లోనూ ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. మన క్రీడాకారులను చూసి దేశం గర్విస్తోందని మోడీ ఓ ట్వీట్ లో తెలిపారు.