వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఈ హైవేలపై టోల్ ఛార్జీలు తగ్గించిన కేంద్రం
హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఆ ప్రాంతాల్లో టోల్ రేట్లను సుమారు 50శాతం వరకు తగ్గించింది.

Highway
Toll Charges: హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఆ ప్రాంతాల్లో టోల్ రేట్లను సుమారు 50శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ టోల్ చార్జీలను లెక్కించడానికి కొత్త ఫార్ములాను నోటిఫై చేస్తూ ఈనెల 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.
2008 నాటి జాతీయ రహదారుల ఫీజు నిబంధనల కింద టోల్ ప్లాజాల్లో యూజర్ చార్జీలు నిర్ణయించారు. ఈ నిబంధనలను కేంద్రం సవరించింది. తాజాగా నిబంధనల ప్రకారం.. ప్లై ఓవర్లు, అండర్ పాస్లు, సొరంగాలున్న ప్రాంతాల్లో టోల్ రేటును 50శాతం వరకు తగ్గించినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. అయితే, ఆయా రహదారిలో టోల్ ఫీజు లెక్క వేయడానికి కొత్త పద్దతిని సూచించారు.
సవరించిన నిబంధనల ప్రకారం.. రహదారిపై ఉన్న నిర్మాణ పొడవును పదితో హెచ్చించి దాన్ని జాతీయ రహదారి సెక్షన్ పొడవుతో కలుపుతారు. అందులోంచి నిర్మాణ పొడవును తీసివేస్తారు. అలాగే, జాతీయ రహదారి సెక్షన్ పొడవును ఐదుతో హెచ్చిస్తారు. ఈ రెండు సమీకరణాల ద్వారా లభించిన సమాధానాల్లో ఏది సంఖ్యాపరంగా తక్కువైతే దాని ప్రాతిపదికన టోల్ ఫీజు లెక్కిస్తారని ఈనెల 2వ తేదీన వెలువడిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా ఆయా మార్గాల్లో టోల్ ఫీజు గణనీయంగా తగ్గిపోతుందని.. అంటే 50శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.