Tata Shares : కనక వర్షం కురిపిస్తున్న టాటా షేర్లు
టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లకు ఈరోజు సిరుల వర్షం కురసింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో..ప్రైవేట్ ఈక్విటీ సంస్థ

Tata
Tata Shares టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లకు ఈరోజు సిరుల వర్షం కురసింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో..ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ రైజ్ క్లైమేట్ నుంచి బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7500 కోట్లు) సమీకరించనున్నట్లు దేశీయ టాటా మోటార్స్ బుధవారం ప్రకటించడంతో ఒక్కసారిగా టాటా షేర్లు జూమ్మంటూ దూసుకుపోయాయి.
టాటా మోటార్స్ షేరు ఈరోజు ఏకంగా 21.11శాతం పెరిగి రూ.509 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకింది. ఇవాళ ఉదయం రూ.462 వద్ద ఈ స్టాక్ ట్రేడింగ్ ప్రారంభమవగా..88.85 రూపాయలు పెరిగి రూ.509.70 వద్ద ముగిసింది.
ఇక,టాటా పవర్ షేరు ఇవాళ 15.32శాతం(రూ.30) పెరిగి జీవితకాల గరిష్ఠం రూ.225.80 వద్ద ముగిసింది. మరోవైపు,టాటా కెమికల్స్ షేరు 14.85శాతం(రూ.142.80) పెరిగి జీవితకాల గరిష్ఠం 1,115 వద్ద ముగిసింది.
టాటా స్టీల్ లిమిటెడ్ 2.06శాతం(రూ.27.40)పెరిగి 1356 వద్ద ముగిసింది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్టర్ షేరు 4.36శాతం(రూ.35.60)పెరిగి జీవితకాల గరిష్ఠం 851.75 రూపాయల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ షేరు 0.14శాతం(రూ.5.20)పెరిగి రూ. 3658 వద్ద ముగిసింది
టాటా మోటర్స్-టీపీజీ ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్ ఇటీవల ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ అనుబంద సంస్థలో పెట్టుబడుల విషయమై.. టాటా మోటార్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి చెందిన టీపీజీ రైజింగ్ క్లైమేట్లు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం..టీపీజీ రైజ్ క్లైమేట్, సహ పెట్టుబడిదారు ఏడీక్యూ (అబుధాబి ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ)తో కలిసి టాటా మోటార్స్ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా టీపీజీ గ్రూప్ 11–15 శాతం మధ్య వాటాను పొందనున్నట్లు టాటా మోటార్స్ తెలియజేసింది.
9.1 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో తాజా పెట్టుబడులు లభిస్తున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. భవిష్యత్లో షేర్లుగా మార్పిడయ్యే(తప్పనిసరి) సెక్యూరిటీల జారీ ద్వారా ఈవీ అనుబంధ సంస్థలో ఏడీక్యూ, టీపీజీ రైజ్ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 18 నెలల్లోగా రెండంచెలలో పెట్టుబడులు లభించనున్నట్లు తెలియజేసింది. అబుధాబి ప్రభుత్వానికి వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించే ఏడీక్యూ.. దేశ, విదేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది.
తమ ఎలక్ట్రిక్ వాహన ప్రయాణంలో టీపీజీ రైజ్ క్లయిమేట్ జత కలవడం ఆనందాన్నిస్తున్నట్లు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. తద్వారా దేశీ మార్కెట్లో మార్పులు తీసుకురాగల ఈవీ విభాగంలో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా ఎలక్ట్రిక్ వాహన వాటాను 30 శాతానికి పెంచే ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా ప్రధాన పాత్రను పోషించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
టాటా మోటార్స్కు ఉన్న ప్రస్తుత పెట్టుబడులు, సామర్థ్యాలను కొత్త ఈవీ కంపెనీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్ పెట్టుబడులను ఎలక్ట్రిక్ వాహనాలు, బీఈవీ ప్లాట్పామ్స్, అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో 10 ఈవీలతోకూడిన పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ భాగస్వామ్యంతో ఛార్జింగ్ మౌలికసదుపాయాలను వేగవంతంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ALSO READ కేంద్రమంత్రిని డిస్మిస్ చేయాలన్న కాంగ్రెస్..ప్రభుత్వంతో మాట్లాడతానన్న రాష్ట్రపతి