CSK Corona : ఐపీఎల్లో కరోనా కలకలం.. చెన్నై జట్టులో ఆ ముగ్గురికి పాజిటివ్.. ఆందోళనలో ప్లేయర్లు
ఐపీఎల్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా సోకగా.. తాజాగా చెన్నై జట్టు శిబిరంలో కేసులు వెలుగుచూశాయి.
CSK Corona : ఐపీఎల్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా సోకగా.. తాజాగా చెన్నై జట్టు శిబిరంలో కేసులు వెలుగుచూశాయి. చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ బాలాజీ, బస్ క్లీనర్ కు పాజిటిగ్ గా తేలింది. జట్టులోని అందరికి టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు చెన్నై తెలిపింది. బయో బబుల్ వాతావరణంలో మ్యాచ్ లు నిర్వహిస్తున్నా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఐపీఎల్ పై కరోనా పిడుగు పడిందని చెప్పాలి. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) రాత్రి 7.30 గంటలకు జరగాల్సిన ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ వాయిదా పడింది. ఆటకు ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కు వైరస్ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్ను వాయిదా వేశారు.
కరోనా భయంతో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు బయో బబుల్లో ఉండలేక లీగ్ నుంచి వైదొలిగారు. అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లు, టీమ్ మెంబర్లు కరోనా బారిన పడటం జట్టు యాజమాన్యాలు, సహచర ఆటగాళ్లలో ఆందోళన నింపింది.