మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా

మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 03:32 PM IST
మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా

Updated On : January 23, 2019 / 3:32 PM IST

మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది.

సూర్యపేట : మతసామరస్యానికి ప్రతీకగా.. వందళ ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన దర్గా అది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్గాకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాన్ పహాడ్ దర్గాకు తెలంగాణ నుంచే కాక కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ముస్లింల పవిత్రస్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకే మతసామరస్యానికి ప్రతీకగా ఈ దర్గాను చెప్పుకుంటారు. 

అభివృద్ధి లేక ప్రాచుర్యంలో వెనకబడి పోయిందే తప్ప… దర్గాకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. సుమారు 400 ఏళ్ళ క్రితం మద్రాస్ రాష్ట్రంలో నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ఆంధ్రరాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి జాన్ పహాడ్ సైదా, బాజీ సైదా, మొయినోద్దిన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలో ఉంది. అయితే.. తప్పుడు సమాచారంతో వీరిపై వజీరాబాద్‌ పాలకులు యుద్ధానికి దిగారు. అందులో వీరు అమరులయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి.. వజీరాబాద్ రాజకుమారుడు.. ప్రాయశ్చిత్తంగా జాన్‌పహడ్‌ దగ్గర దర్గా నిర్మించాడు. 

దర్గాకు వచ్చేవారికి మొదట కనిపించేది సఫాయి బావి. భక్తులు ఇక్కడి నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి దేవుడికి సమర్పించడం అనవాయితీ. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని విశ్వసిస్తారు.  అలాగే పశుపక్ష్యాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని.. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. దర్గా ప్రాంతం అంతా అడవి కావడం వలన అక్కడికి దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం అక్కడ ఒక నాగుపామును, పెద్ద పులిని ఉంచారని పూర్వీకులు చెబుతుంటారు.  

ఇంతటి ప్రతిష్టగల జాన్‌పహాడ్‌ దర్గా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. ప్రతి ఏటా దర్గాకు 3 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. హిందూ, ముస్లింల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. దర్గాకు ప్రతి యేటా సుమారు మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఎలాంటి సౌకర్యానికి నోచుకోలేదు. ప్రతి శుక్రవారం భక్తులు కందూరు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాలు శిథిలావస్థలో ఉండడంతో ఆరుబయట చెట్ల కింద వంటావార్పు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

దర్గాకు భారీగా భక్తుల వస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు దర్గా సమీపంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనను వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి పంపినా ఇంతవరకు ఎలాంటి స్పందనాలేదు. జాన్ పహాడ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీనిచ్చినా.. ఇప్పటికీ దానికి సంబంధించిన ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. హిందూ ముస్లింలకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న జాన్ పహాడ్ దర్గాకు 50 లక్షల రూపాయలతో కొన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ తీర్చాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి.