చెన్నై వేదికగా ఐపీఎల్ వేలం

చెన్నై వేదికగా ఐపీఎల్ వేలం

Updated On : January 24, 2021 / 12:18 PM IST

IPL auction : ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న లీగ్‌గా పేరొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులు చైన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్నాయి. రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు జరగనుంది. దీంతో ఫిబ్రవరి 18 లేదా 19 తేదీల్లో ఆటగాళ్ల వేలం పాట చెన్నైలోనే నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

జనవరి 20తో ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోయింది. దీంతో ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను కూడా వదులుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఫిబ్రవరి 4 వరకు ఫ్రాంఛైజీలు తామ ఉంచుకునే ప్లేయర్లు, వదులకునే ప్లేయర్ల జాబితాను బీసీసీకి అందించవచ్చు, ప్రస్తుతం ఎనిమిది ఫ్రాంచైజీల దగ్గర ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 196 కోట్ల రూపాయల ధనం అందుబాటులో ఉంది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. దీంతో చిదంబరం స్టేడియంలో జరిగే తొలి రెండు టెస్టులను ప్రేక్షకులు లేకండానే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న భారత్, ఇంగ్లండ్ జట్లు చెన్నై చేరుకుంటాయి. బయో బబుల్‌లోకి వెళ్లడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న తొలి టెస్టు ప్రారంభం అవుతుంది.