IndVsWI 1st ODI : శివమెత్తిన శిఖర్ ధావన్.. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

Indvswi 1st Odi (2)
IndVsWI 1st ODI : వెస్టిండీస్ తో తొలి వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. టాప్ ఆర్డర్ అదరగొట్టింది. భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శిఖర్ ధావన్ శివమెత్తగా.. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు మెరిశారు. కాగా, ధావన్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ధావన్ 99 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి.
గిల్ 53 బంతుల్లో 64 పరుగులు చేశాడు. గిల్ స్కోర్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అయ్యర్ 57 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయ్యర్ స్కోర్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. దీపక్ హుడా(27), అక్షర్ పటేల్(21) పరుగులు చేశారు. దీంతో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు 309 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గోడాకేష్ మోటీ తలో 2 వికెట్లు తీశారు. రొమారియో షెపర్డ్, అకీల్ హోసీన్ చెరో వికెట్ పడగొట్టారు.
Rishabh Pant: రిషబ్ పంత్ బరువు తగ్గాలి: షోయబ్ అఖ్తర్
టీమిండియా ఓపెనర్లు ధావన్, గిల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వన్డౌన్ బ్యాట్స్మన్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13), సంజూ శాంసన్ (12) విఫలమయ్యారు. చివర్లో దీపక్ హుడా (32 బంతుల్లో 27 పరుగులు), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 21 పరుగులు) కాస్త నిలకడగా ఆడి విలువైన భాగస్వామ్యం నిర్మించారు. వీరిద్దరి భాగస్వామ్యంతోనే భారత్ 300 పై చిలుకు పరుగులు సాధించింది. తొలుత పేలవంగా బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బంతులేశారు.
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన శుక్రవారం అధికారికంగా మొదలైపోయింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో టీమిండియా 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ను ఆడనుంది. ఈ సిరీస్ శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. సిరీస్లో తొలి మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ను ఎంచుకుని భారత జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ట్రినిడాడ్లోని పార్క్ ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్ కి వేదికైంది.
Cheteshwar Pujara: చతేశ్వర్ పూజారా రీసెంట్ డబుల్ సెంచరీ
ఈ మ్యాచ్లో టీమిండియాకు శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులో చేరాడు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. వరుస సిరీస్లను గెలుస్తున్న టీమిండియా జోరు మీదుంది.