FACT CHECK : సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కిన మాక్స్వెల్..? ఆ విధ్వంసకర డబుల్ సెంచరీ తరువాత..
Glenn Maxwell - Sachin Tendulkar : డబుల్ సెంచరీ తరువాత మాక్స్వెల్ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కాళ్లకు నమస్కరించినట్లు ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![FACT CHECK : సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కిన మాక్స్వెల్..? ఆ విధ్వంసకర డబుల్ సెంచరీ తరువాత.. FACT CHECK : సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కిన మాక్స్వెల్..? ఆ విధ్వంసకర డబుల్ సెంచరీ తరువాత..](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-14-1.jpg)
Maxwell Touching Sachins Feet
ముంబైలోని వాంఖడే వేదికగా నవంబర్ 7 మంగళవారం అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సాధించింది. 292 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. అయితే.. ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అజేయ ద్విశతకంతో జట్టును అద్వితీయ విజయాన్ని అందించాడు. మాక్స్వెల్ విధ్వంసంతో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విరోచిత డబుల్ సెంచరీ తరువాత మాక్స్వెల్ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కాళ్లకు నమస్కరించినట్లు ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘క్రికెట్ చరిత్రలో గొప్ప క్షణాల్లో ఒకటి. అఫ్గాన్ మ్యాచ్ అనంతరం మాక్స్వెల్ను అభినందించేందుకు సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వస్తే.. మాక్సీ దిగ్గజ ఆటగాడు సచిన్ పాదాలను తాకీ ఆశీస్సులు తీసుకున్నాడు.’అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. దీంతో నిజంగానే సచిన్ కాళ్లపై మాక్స్వెల్ పడాడ్డా..? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
Also Read : చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. లారా రికార్డు బద్దలు కొట్టిన ఇబ్రహీం జద్రాన్
కాగా.. ఈ ఫోటో ఫేక్ అని తెలిసింది. ఫోటో షాప్ ద్వారా ఈ ఫోటోను క్రియేట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అసలు మ్యాచ్ రోజు సచిన్ వాంఖడే స్టేడియానికి వెళ్లలేదని తెలిసింది. అయితే.. మ్యాచ్ కు ముందు రోజు అఫ్గానిస్థాన్ ఆటగాళ్లను అభినందించేందు సచిన్ స్టేడియానికి వెళ్లాడు. ఈ సందర్భంగా సచిన్ అఫ్గాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలలో ఓ ఫోటోని తీసుకుని మాక్స్వెల్ వంగి ఉన్న ఫోటోతో కలిపి సచిన్ పాదాలకు మాక్సీ నమస్కరిస్తున్నట్లు ఎడిట్ చేశారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్; 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడినా మాక్స్వెల్ ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సెమీస్ బెర్తును ఆసీస్ ఖాయం చేసుకుంది.