Rohit Sharma : చెన్నైపై ఓటమి.. బాధతో ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్కు రోహిత్ శర్మ..
వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రదర్శననే ముఖ్యం అని ఎప్పుడూ చెబుతుంటాడు రోహిత్ శర్మ.
Rohit Sharma walks alone : హ్యాట్రిక్ ఓటములతో ఈ సీజన్ను ప్రారంభించింది ముంబై ఇండియన్స్. అయితే.. కోలుకుని వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించింది. ముంబై జోరుకు ఆదివారం చెన్నై బ్రేకులు వేసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబె (66 నాటౌట్; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖరల్లో ధోనీ (20*; 4 బంతుల్లో 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముండై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితమైంది.
ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (105 నాటౌట్; 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో పోరాడాడు. అయితే.. మిగిలిన వారు అతడికి సరైన సహకారం అందించకపోవడంతో ముంబై విజయాన్ని సాధించలేకపోయింది. కాగా.. తన టీ20 కెరీర్లో 8వ శతకాన్ని అందుకున్న రోహిత్ శర్మ ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అప్పటికే ముంబై ఓటమి ఖరారు కావడంతో హిట్మ్యాన్ సంబురాలు చేసుకోలేదు.
వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రదర్శననే ముఖ్యం అని ఎప్పుడూ చెబుతుంటాడు రోహిత్ శర్మ. ఇక మ్యాచ్ ముగిసిన తరువాత అతడు ఓటమి బాధలో మునిగిపోయాడు. తన జట్టును గెలిపించలేకపోయానే బాధ అతడిలో కనిపించింది. తీవ్ర భావోద్వేగంతో తల దించుకుని మైదానంలోంచి ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
MI vs CSK : హార్దిక్ పాండ్య బౌలింగ్లో ధోని సిక్స్.. రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే
కాగా.. ముంబై జట్టులో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక స్కోరు తిలక్ వర్మ సాధించిన 31 పరుగులే గమనార్హం. ఈ సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. రెండు మ్యాచుల్లో గెలిచి నాలుగు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
@ImDrago45 pic.twitter.com/1mLrPoZqPO
— Rohit is the GOAT🐐 (@dranzertweets) April 15, 2024