GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’

పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి త‌రువాత గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’

pic credit @mufaddal_vohra

Updated On : March 26, 2025 / 10:15 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌ను విజ‌యంతో ఆరంభించాల‌ని భావించిన గుజరాత్ టైటాన్స్‌కు నిరాశే ఎదురైంది. మంగ‌ళ‌వారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 11 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఓ రెండు త‌ప్పిదాల కార‌ణంగానే తాము ఓడిపోయామ‌ని గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ చెప్పాడు. బ్యాటింగ్‌లో తొలి మూడు ఓవ‌ర్ల‌లో, మిడిల్‌లో మూడు ఓవ‌ర్ల‌లో ప‌రుగులు చేయ‌లేక‌పోవ‌డం ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం అని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్ చేసే స‌మ‌యంలో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని, అయితే.. వాటిని తాము అందిపుచ్చుకోలేకపోయామ‌ని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. తొలుత బౌలింగ్ చేసేట‌ప్పుడు చాలా ఎక్కువ‌గా ప‌రుగులు ఇచ్చిన‌ట్లు తెలిపాడు. ఇక ఫీల్డింగ్‌లో తాము చేసిన త‌ప్పిదాలు కూడా పంజాబ్‌కు క‌లిసి వ‌చ్చాయ‌న్నాడు.

GT vs PBKS : మాక్స్‌వెల్ ఆ విష‌యాన్ని మ‌రిచిపోయావా..? చూడు ఇప్పుడు ఏమైందో.. పాంటింగ్ రియాక్ష‌న్ చూశావా?

ఆ త‌రువాత బ్యాటింగ్‌లో తొలి మూడు ఓవ‌ర్ల‌లో ఎక్కువ ప‌రుగులు చేయ‌లేదు. అదే స‌మ‌యంలో మిడిల్ లో మూడు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డంతో మ్యాచ్ చేజారింద‌న్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా త‌మ‌కు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయ‌న్నాడు. ఈ టోర్నీకి ఇది మంచి ఆరంభం అని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అంత ఈజీ కాదు..

ఇక విజ‌య్ కుమార్ వైశాక్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 15 ఓవ‌ర్ల పాటు బెంచ్‌పై కూర్చోని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి వైడ్ యార్క‌ర్లు వేయ‌డం అంత సుల‌భం కాద‌న్నాడు. విజ‌యంలో అత‌డికి ఖ‌చ్చితంగా క్రెడిట్ ఇవ్వాల‌న్నాడు. ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయ‌డం చాలా సులువు. ఈజీగా 240-250 ప‌రుగులు చేయొచ్చు. అయిన‌ప్ప‌టికి ప్రత్య‌ర్థిని సాధ్య‌మైనంత త‌క్కువ స్కోరు ప‌రిమితం చేయాల్సింద‌ని గిల్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

GT vs PBKS : శ్రేయ‌స్ అయ్యర్ సెంచ‌రీకి ఎందుకు స‌హ‌క‌రించ‌లేదంటే.. అస‌లు నిజం చెప్పిన శ‌శాంక్ సింగ్..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (97 నాటౌట్‌; 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లు), శ‌శాంక్ సింగ్ (44 నాటౌట్; 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ప్రియాంష్ ఆర్య (47; 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సాయి కిషోర్ మూడు వికెట్లు తీశాడు. ర‌బాడ‌, ర‌షీద్ ఖాన్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం సాయి సుద‌ర్శ‌న్ (74; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), జోస్ బ‌ట్ల‌ర్ (54; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), షెఫానీ రూథర్‌ఫర్డ్‌ (46; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స‌ర్లు) దంచికొట్టిన‌ప్ప‌టికి గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 232 ప‌రుగుల‌కే ప‌రిమితం అయింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్‌, గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.