Women IPL Media Rights: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు వయాకామ్ 18 చేతికి.. ఒక్కో మ్యాచ్కు ఎంతంటే?
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.

Women IPL Media Rights
Women IPL Media Rights: మహిళల ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) పోటీలకు సర్వంసిద్ధమవుతోంది. మార్చి 2023లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నెలలో ఐపీఎల్ ప్రాంచైజీల ప్రకటన జరగనుంది. ఫిబ్రవరి నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనుండగా.. ప్లేయర్లు జనవరి 26లోగా తమపేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్లో ఐదుజట్లు డబుల్ రౌండ్ రాబిన్ టోర్నీలో పోటీ పడనున్నాయి. తాజాగా మహిళల ఐపీఎల్ టోర్నీ ప్రసార హక్కుల విక్రయాలను బీసీసీఐ పూర్తి చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ ఖాతాలో వందల కోట్లు చేరనున్నాయి.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు. ఐదేళ్ల పాటు (2023-2027) ఒక్కో మ్యాచ్ ప్రసార హక్కుల కోసం వయాకామ్ రూ. 7.09 కోట్లు చెల్లించనుంది. ఈ సందర్భంగా మీడియా హక్కులను దక్కించుకున్నందుకు జై షా వయాకామ్ 18ని అభినందించారు. అయితే, మహిళల క్రికెట్ కు ఇది చారిత్రాత్మకమని జై షా అభివర్ణించారు.
Congratulations @viacom18 for winning the Women’s @IPL media rights. Thank you for your faith in @BCCI and @BCCIWomen. Viacom has committed INR 951 crores which means per match value of INR 7.09 crores for next 5 years (2023-27). This is massive for Women’s Cricket ???
— Jay Shah (@JayShah) January 16, 2023
మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల కోసం వయాకామ్ 18తో పాటు జీ, సోనీ, డిస్నీ స్టార్ లు కూడా పోటీ పడ్డాయి. నెట్వర్క్- 18కి చెందిన వయాకామ్ పురుషుల ఐపీఎల్ కు డిజిటల్ ప్రసార హక్కులను సైతం దక్కించుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏటీ 20 లీగ్ ప్రసార హక్కులనుకూడా ఈ సంస్థే దక్కించుకుంది.