Telangana Farmers : రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

Telangana Farmers : రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

Rythu Bandhu

Updated On : June 14, 2021 / 11:51 AM IST

Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాలో 2021, జూన్ 15వ తేదీ మంగళవారం నుంచి రైతు బంధు నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది. రైతుబంధుకు 63లక్షల 25 వేల మంది అర్హులని ఆ జాబితాలో పేర్కొన్నారు. రైతుబంధుకు గతంలో కంటే ఈసారి 2లక్షల 81వేల మంది రైతులు పెరిగారు.

నూతనంగా 66వేల 311ఎకరాల భూమి ఈ పథకంలో చేరింది. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈసారి రైతుబంధు లబ్దిదారుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4లక్షల 72వేల 983 మంది రైతులు ఉన్నారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి బడ్జెట్‌లో 14వేల 656 కోట్లకు పైగా విడుదల చేశారు.

ఈ వానాకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్‌లో 14వేల 800 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరుగుతున్నా కూడా సీఎం కేసీఆర్‌ ఎక్కడా వెనక్కు తగ్గకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దీని వలన తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు.

Read More : Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..