మా కుటుంబానికి అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు : కల్నల్ సంతోష్బాబు భార్య

సీఎం కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి తెలిపారు. తమ పిల్లలకు రూ.4 కోట్లు, సంతోష్బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును అందజేయడంతో పాటు, తనకు గ్రూప్-1 ఉద్యోగం, బంజారాహిల్స్లో 711 గజాల ఇంటిస్థలం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం (జూన్ 22, 2020) ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోపా ఇచ్చారని చెప్పారు.
తన పిల్లలతో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారని, తమను ఇంటికి కూడా ఆహ్వానించారని ఆమె పేర్కొన్నారు. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. తన మాదిరిగానే ఇతర జవాన్లకు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారని కల్నల్ సంతోష్బాబు తల్లి మంజుల అన్నారు. తమకు అండగా నిలిచిన మంత్రి జగదీశ్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సంతోష్బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ సోమవారం పరామర్శించారు. సూర్యాపేటలోని విద్యానగర్లో ఉన్న సంతోష్బాబు నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం కేసీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శించారు.