ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం.. కేసీఆర్ను కేఏ పాల్తో పోల్చిన సీఎం రేవంత్
రైతుబంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని చెప్పారు.

CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ వందరోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకు మించి ఓట్లు వస్తాయని చెప్పారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది. 17 సెప్టెంబర్ 2025తో మోదీకి 75ఏళ్లు నిండుతాయి. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని రేవంత్ అన్నారు.
Also Read : పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి
బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. 400 సీట్లు ఎట్లా సాధ్యం అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 13ఏళ్లు సీఎంగా, 10ఏళ్లు పీఎంగా పనిచేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీయే కూటమి ఎందుకు చెప్పడం లేదు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారని రేవంత్ విమర్శించారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతుంటే.. మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్.. దీన్ని బట్టి తెలుస్తోంది.
Also Read : తెలంగాణలో పలుచోట్ల ఎన్నికలను బహిష్కరించిన ఓటర్లు
ఎవరు అట్టడుగు వర్గాల ప్రజలకోసం పనిచేస్తున్నారో చర్చకు సిద్ధం. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని రేవంత్ అన్నారు. బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లయింట్ చేయదు. కానీ, ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహఎచ్ఏ రంగంలోకి దిగింది. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది ఓ నిదర్శనం. బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు అంబానీ, అదానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
Also Read : Manchu Lakshmi : హైదరాబాద్ సిగ్గుచేటు.. నేను ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చాను..
రైతుబంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదు. పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది. మానసిక ఒత్తిడిలో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.