Guvvala Balaraju : నన్ను చంపేందుకు కుట్ర, నాపై దాడి చేసింది వారే- గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు
Guvvala Balaraju Allegations : జైలు నుండి క్రిమినల్స్ ని తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. చావడానికైనా సిద్ధం. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.
తనను ఎదుర్కొనేందుకు చేతగాక తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని బీఆఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. చావడానికైనా సిద్ధమేనని వెనకడుగు వేసే ప్రసక్తి లేదని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన గువ్వల బాలరాజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసింది ఎవరో ఆయన చెప్పారు. తనపై దాడి చేసింది కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, అతడి అనుచరులు అని గువ్వల బాలరాజు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ కొత్త ఆనవాయితీ..
”తెలంగాణలో ఎన్నడూ లేని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత శిక్షించబడుతుంది. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు. నిన్న నా మీద దాడి చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలు ప్రజల మధ్యన ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నాకు బీ ఫామ్ ఇచ్చి ప్రజలను దీవించాలని కోరారు.
నిన్న నా ప్రచారం ముగుంచుకుని వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా కాన్వాయ్ ని వెంబడిస్తూ అచ్చంపేట రాగానే ఆపి నామీద దాడికి దిగారు. నా అదృష్టం, ప్రజల దీవెనల వల్ల బతికి బయటపడ్డా. నా కెమెరామెన్లు, నా అనుచరుల మీద విచక్షణారహితంగా దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గతంలో నా ఆఫీసు మీద దాడి చేశాడు. నిన్న వంశీకృష్ణ రాయితో దాడి చేశాడు.
Also Read : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను..
ప్రజల కోసం ప్రజా సేవలో ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వెంబడి ఉంటాను. అచ్చంపేట అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నా. ప్రజలు పెద్ద సంఖ్యలో నాకు మద్దతు తెలుపుతున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. గెలిచి చూపిస్తా. పగలు, ప్రతీకారాలు లేకుండా పని చేస్తున్నాను.
నేను నమ్మే దైవం, నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. వంశీకృష్ణ అతని అనుచరులు నా మీద దాడి చేశారు. వంశీకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా.
జైలు నుండి క్రిమినల్స్ ని తీసుకొచ్చి..
ఈ దాడి పిరికితనంతో చేసింది. నన్ను ఎదుర్కొనే శక్తి లేక అంతమొందించే కుట్ర చేస్తున్నారు. జైలు నుండి క్రిమినల్స్ ని తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. నా అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చావడానికైనా సిద్ధం. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం. అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నా. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఎవరెన్ని దాడులు చేసిన అచ్చంపేట ప్రజల కోసం, అభివృధ్ధి కోసం పని చేస్తాను. వెనకడుగు వేయను. కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం చెబుదాం. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆశయాల మేరకు పనిచేద్దాం” అని గువ్వల బాలరాజు అన్నారు.
Also Read : కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు సీఐ బెదిరింపులు.. ఈసీకి ఫిర్యాదు చేసిన పార్టీ నేత నిరంజన్