KTR: మళ్లీ పిలుస్తాం.. ఫోన్తో రండి.. కేటీఆర్కు ఏసీబీ ఆదేశాలు
విచారణ అనంతరం కేటీఆర్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ఏసీబీ యత్నించింది. అయితే, తాను ఇవాళ సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు.

KTR
KTR: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించి స్టేట్ మెంట్ ను నమోదు చేసుకుంది ఏసీబీ. మరోసారి విచారణకు పిలుస్తామని, అందుబాటులో ఉండాలని కేటీఆర్ తో చెప్పారు ఏసీబీ అధికారులు. అంతేకాదు ఈసారి విచారణకు వచ్చే సమయంలో మీరు వాడిన మొబైల్ ఫోన్లు తీసుకురావాలని కేటీఆర్ తో ఏసీబీ అధికారులు చెప్పారు.
2021 నుండి 2023 వరకు వాడిన మొబైల్స్ సమర్పించాలని కేటీఆర్ ను ఏసీబీ ఆదేశించింది. ఈ నెల 18వ తేదీ లోగా మొబైల్స్ సమర్పించాలంది. కాగా, ఇవాళ విచారణ అనంతరం కేటీఆర్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ఏసీబీ యత్నించింది. అయితే, తాను ఇవాళ సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు. దీంతో ఈ నెల 18లోపు ఫార్ములా ఈ కార్ రేస్ హయాంలో వాడిన సెల్ ఫోన్లు సబ్మిట్ చేయాలని ఏసీబీ ఆదేశించింది.
Also Read: మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో సుమారు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ ను విచారించారు. ఎఫ్ఈవోతో ఒప్పందాలు, నగదు లావాదేవీలపై కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండీఏ నిధుల అంశంపైనా కేటీఆర్ ను విచారించారు.
విచారణలో కేటీఆర్ ను ప్రధానంగా 60 నుంచి 70 ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. గతంలో జనవరి 9న ఈ కార్ రేస్ కేసులో సుమారు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. అప్పుడు 60 నుంచి 70 ప్రశ్నలు అడిగారు. ఇవాళ కూడా 60 నుంచి 70 వరకు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ కార్ రేస్ కేసులో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు ఏ విధంగా బదిలీ చేశారు? ఆర్బీఐ, మంత్రివర్గం అనుమతి లేకుండా ఏ విధంగా నిధులు బదిలీ చేశారు? అనేదానిపై మరోసారి కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కంపెనీ సీఈవో, సంస్థ ప్రతినిధుల స్టేట్ మెంట్ల ఆధారంగా మరోసారి ఇవాళ కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించారు. సుమారు 7 గంటల పాటు అనేక కోణాల్లో కేటీఆర్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.