Gaddar Funeral: గద్దర్ అంతిమయాత్రలో తొక్కిసలాట.. గద్దర్ స్నేహితుడి మృతి
గద్దర్ కడసారి చూపుకోసం అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
Gaddar Funeral Procession – Stampede: ప్రజాగాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గద్దర్ కడసారి చూపుకోసం అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్ లోని లక్డీకాపూల్ కు చెందిన, ఓ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్. ఆయన గద్దర్ కు అత్యంత సన్నిహితుడు. తొక్కిసలాట జరిగిన అనంతరం అలీ ఖాన్ ను కొందరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఎల్బీ నగర్ వరకు అంతిమయాత్రలో అలీఖాన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన సృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించిన తర్వాత డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారని ధ్రువీకరించారు. అలాగే, మరొకరికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
కాగా, గద్దర్ అంతిమ యాత్ర హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ వరకు కొనసాగింది. అల్వాల్లోని భూదేవినగర్ మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. బౌద్ధమత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.
గద్దర్ అమర్రహే అంటూ అభిమానులు నినాదాలు చేశారు. మహాబోధి స్కూల్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. గద్దర్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.
Gaddar: గద్దర్ మృతిపై సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల