BRS: పోలింగ్‌ డే మిస్టేక్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందా? కారు పార్టీని వెంటాడుతున్న ప్రశ్నలు ఏంటి?

పోలింగ్‌ రోజు అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ రోజు డబ్బు డ్రామా బయటపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

BRS: పోలింగ్‌ డే మిస్టేక్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందా? కారు పార్టీని వెంటాడుతున్న ప్రశ్నలు ఏంటి?

Updated On : November 13, 2025 / 8:55 PM IST

BRS: పోలింగ్ రోజు ఏం జరిగింది. ఇన్‌చార్జీలు ఇంట్లోనే ఉన్నారా..? ఏజెంట్లు ఏం చేశారు? ఇప్పుడివే ప్రశ్నలు బీఆర్ఎస్ హైకమాండ్‌ను వెంటాతున్నాయట.. సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిన నేతలకు స్పెషల్‌ క్లాస్ తీసుకునేందుకు తెలంగాణ భవన్‌లో క్లాస్‌రూమ్‌ కూడా రెడీ చేస్తున్నారట. పోలింగ్‌ రోజు జరిగిన పొరపాటు కౌంటింగ్‌ డే కంటిన్యూ కాకుండా అలర్ట్ అయ్యిందట పార్టీ అధిష్టానం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ నేతలకు ఫోన్లు చేసి మరీ వార్నింగ్‌ ఇచ్చారట.

పోలింగ్ రోజున రిలాక్స్ మోడ్ లోకి..!

జూబ్లీహిల్స్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని అస్త్రశస్త్రాలను వాడింది. అన్ని పార్టీల కంటే ముందే ప్రచార రథాన్ని జూబ్లీహిల్స్ గల్లీల్లో చక్కర్లు కొట్టించింది. అందరికంటే ముందే బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకున్నారు. మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు జూబ్లీహిల్స్‌లో వాలిపోయి ప్రచారంలో డోస్ పెంచారు. ప్రచారాన్ని సక్సెస్ చేసిన నేతలు పోలింగ్‌ను లైట్‌ తీసుకున్నారట. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ రోజు కొందరు డివిజన్‌ ఇన్‌చార్జీలు, బూత్‌ ఏజెంట్లు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారట! చివరిరోజు వరకు డివిజన్లలో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన ఇన్‌చార్జీలు పోలింగ్ రోజు మాత్రం సైలెంట్ అయ్యారట.

ఎగ్జిట్‌ పోల్స్ సర్వేల ఫలితాల అధికార పార్టీలో జోష్‌ తెచ్చాయి. కానీ ప్రధానపక్ష పార్టీ బీఆర్ఎస్‌ ని మాత్రం అంతర్మథనంలో పడేశాయి. 2 నుంచి 7 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారంటూ అంచనా వేశాయి. అసలు లోపం ఎక్కడ జరిగిందని తెలంగాణ భవన్‌లో చర్చలు సాగుతున్నాయట. ముందు నుంచి వర్కౌట్‌ చేసినా.. ఎందుకు ప్రతికూల వాతావరణం ఏర్పడిందని బీఆర్ఎస్‌ ఆలోచనలో పడిందట. ఎక్కడ వెనకడుగు పడిందో బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు తీస్తుందట. అందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చివరి గడియ వరకు కష్టపడిన ఇన్‌చార్జీలు, పార్టీ నేతలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారనే గాసిప్ తెలంగాణ భవన్‌లో రీసౌండ్ చేస్తోంది. పోలింగ్ రోజు క్యాడర్‌తో టచ్‌లో ఉంటూ అలర్ట్ చేయాల్సిన నేతలు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోందట. పోలింగ్ బూత్ ఏజెంట్లను పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదట. అధికార కాంగ్రెస్ ఏం చేసింది? ఎన్నికల అధికారులు, పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారన్న మానిటరింగ్‌ మాటే లేదట. ఇదే బిగ్‌ మిస్టేక్ అని బీఆర్ఎస్ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

కొందరు పోలింగ్ బూత్ ఏజెంట్ల తీరుతో.. భారీ నష్టం?

కొందరు పోలింగ్ బూత్ ఏజెంట్ల తీరుతో.. భారీ నష్టం జరిగిందనే చర్చ కూడా తెలంగాణ భవన్‌లో సాగుతోంది. ఏజెంట్లను అధికార కాంగ్రెస్ నేతలు డబ్బులతో మేనేజ్ చేశారని, మరికొందరిని బెదిరించారని, కొన్ని డివిజన్లలో పార్టీ సొంత ఏజెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు అవగాహనకు వచ్చారట. ఈ పరిస్థితులన్నింటిని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకుందని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలంగాణ భవన్‌లో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

మరోవైపు పోలింగ్‌ రోజు అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ రోజు డబ్బు డ్రామా బయటపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నాన్-లోకల్ కాంగ్రెస్ లీడర్లు హోటల్‌లో దాక్కుని ఓటర్లను మభ్య పెట్టారని బహిరంగంగా చెబుతోంది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూడా మోడల్ కోడ్ ఉల్లంఘనలపై నిరసనగళం విప్పారు.

ఇవన్నీ పక్కనబెడితే.. పోలింగ్‌ రోజు జరిగిన పొరపాటు కౌంటింగ్‌ రోజు కంటిన్యూ కాకుండా ఫుల్‌ అలర్ట్ అయింది బీఆర్ఎస్ అధిష్టానం. హరీశ్‌రావు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని వార్నింగ్ ఇచ్చారట. కాంగ్రెస్ ఏం చేసినా ఫోటో తీసి పంపండని ఆర్డర్లు ఇచ్చారట. ఓట్ల కౌంటింగ్ సందర్బంగా ఎలా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిబంధనలు ఎలా ఉంటాయి వంటి విషయాలపై కౌంటింగ్‌ ఏజెంట్లకు హరీశ్‌రావు అవగాహన కల్పించారు. అయితే అంతా అయ్యాక ఇప్పుడు అలర్ట్ అయితే ఏం లాభమనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

Also Read: సరిగ్గా పోలింగ్‌కు ముందు హస్తం పార్టీ ఎలా బలపడింది? ఈ పాయింట్లే కారణం..