సరిగ్గా పోలింగ్కు ముందు హస్తం పార్టీ ఎలా బలపడింది? ఈ పాయింట్లే కారణం..
ఫైనల్గా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అసలు కథ స్టార్ట్ చేసిందట.
Revanth Reddy
Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ బైపోల్. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించిన ఉప ఎన్నిక. సిట్టింగ్ స్థానం కోసం బీఆర్ఎస్, పట్టు, పరువు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగానే శ్రమించాయి. అయితే ప్రీపోల్ సర్వేల్లో అన్నింట్లో బీఆర్ఎస్ ముందుంటే..ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్కే ఇచ్చాయి.
ఆఖరి వారం రోజులు కాంగ్రెస్ గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చేసింది. అప్పటివరకు ముగ్గురు మంత్రులకు ఇంచార్జ్ ఇచ్చిన సీఎం..ఆ తర్వాత ప్రతీ డివిజన్కు ఇద్దరు మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు..అందరినీ రంగంలోకి దించి..అన్నీ తానై..సీఎం రేవంత్ ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకొని పర్యవేక్షించారు.
స్వయంగా ప్రతీ రోజూ ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకొని..ఆయనే మానిటరింగ్ చేశారు. బైపోల్కు వారం రోజుల ముందు మంత్రులు, ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ పెట్టి..ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను లైట్ తీసుకుంటే..ఫలితం తేడా వస్తే ఏం జరుగుతుందనేది వివరించారట. అనుకున్న రిజల్ట్ రాకపోతే అందరి పుట్టి మునుగుతుందని స్పష్టం చేశారట. తాను కుర్చీ దిగితే అందరి పదవులు పోతాయన్నారట. అంతేకాదు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. రాబోయే మూడేళ్లు కూడా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడం కష్టమవుతుందని చెప్పారట.
Also Read: తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్డేట్స్ మీద అప్డేట్స్.. ఈ ఆధారాలతో ఇరికిపోయేదెవరు?
అధికారులు మాట వినాలన్నా.. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని దిశానిర్దేశం చేశారట. దీంతో మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగాలు సీరియస్గా తీసుకున్నారట. అప్పటి నుంచి గ్రౌండ్లో రోజు రోజుకు సమీకరణాలు మారుతూ వచ్చాయంటున్నారు. సీఎం మీటింగ్ తర్వాత నుంచి ప్రతీ రోజూ కాంగ్రెస్ తనదైన శైలిలో సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది.
మైనారిటీ కోటాలో అజారుద్దీన్ను మంత్రిని చేసి ముస్లింలను అట్రాక్ట్ చేయడంలో కొత్త సక్సెస్ అయ్యామని భావిస్తోందట అధికార పార్టీ. ఆ తర్వాత ఒక్కొక్క కులాన్ని తమవైపు తిప్పుకునేందుకు కులాసంఘాల మీటింగ్లను ఆయా మంత్రులు, కులాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశాలు పెట్టించి మద్దతు కూడగట్టింది. ఆయా వర్గాలు కోరుతున్న పనులు, ఆశిస్తున్న డెవలప్మెంట్ వర్క్స్పై భరోసా కల్పించింది. ఎన్టీఆర్, ముఖేష్ గౌడ్ల విగ్రహాలు, కుల సంఘాలకు హామీలు గుప్పించింది.
మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఫలించాయా?
స్వయంగా సీఎం రేవంత్ తన దగ్గరకు కొన్ని కులాల ప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడారు. కాలనీల ప్రెసిడెంట్లతో పాటు ప్రభావం చూపగలిగిన వారి ఇళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లి వారితో ముచ్చటించి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంచార్జ్ బాధ్యతలు ఉన్న ఏ ఒక్క నేత కూడా నియోజకవర్గం నుంచి పక్కకు కదలకుండా చూడగలిగారు. ప్రతీ రోజు నివేదికలు తెప్పించుకొని నేతలకు టాస్క్లు ఇచ్చి పని చేయించారు.
ఇక ఫైనల్గా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అసలు కథ స్టార్ట్ చేసిందట. ఓటరు జాబితాను ముందు పెట్టుకుని..కాంగ్రెస్ సానుభూతి పరులు ఎవరు, బీఆర్ఎస్ మద్దతుదారులెవరు.? తటస్తులు ఎవరనేది ఐడెంటిఫై చేశారట. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్నారు. పోలింగ్ డేనాడు వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యంలోకి నెట్టింది. ఓటింగ్ రోజు పోలింగ్ బూత్ ఏజెంట్ అనే వ్యక్తి అత్యంత కీలకం.
ఈ ఏజెంట్ల విషయంలో కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొన్ని ఎంపిక చేసిన చోట్ల ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఏజెంట్లు కూడా తమవైపు రావడంతో ఓటింగ్ తమకు అనుకూలంగా జరిగేలా చక్రం తిప్పారన్న ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు ప్రతీ గంటకు ఒకసారి ఎవరు ఓటేశారు..ఓటేయని వారు ఎవరున్నారనేది గుర్తించి వారికి ఫోన్లు చేసి పిలిచేందుకు ప్రత్యేకంగా ఒక వింగ్ పనిచేసిందట.
పోల్ మేనేజ్మెంట్లో భాగంగా తమ అనుకూల ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో సక్సెస్ అయ్యారట. అందుకే పోలింగ్ సరళిని పరిశీలించిన ఎగ్జిట్పోల్ సంస్థలు మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పెద్దలు..ముఖ్యంగా సీఎం రేవంత్ అనుసరించిన వ్యూహాలకు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోతున్నారట.
దుబ్బాక, మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించి స్ట్రాటజీ, వ్యూహాలను చూసి కాంగ్రెస్ నేతల ఎంతో నేర్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ఫస్ట్ బైపోల్లో స్పెషల్ యాక్షన్ ప్లాన్తో సక్సెస్ కాగలిగామని..ఫైనల్గా జూబ్లీహిల్స్ను కూడా తమ ఖాతాలో వేసుకోబోతున్నామని అంటున్నారు హస్తం పార్టీలు. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయో మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
