Harish Rao: గిరిజన యూనివర్సిటీని కొత్తగా ఇచ్చేది ఏంటి?.. చెవిలో పూలు పెడుతున్నారు: హరీశ్ రావు
మోదీ వచ్చి, ఉత్త మాటలు చెప్పి వెళ్లారని, చిలుక పలుకులు పలికారని హరీశ్ రావు అన్నారు.

Harish Rao Thanneeru
Harish Rao: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కురిపించిన వరాల వర్షంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
గిరిజన యూనివర్సిటీ అంటూ మోదీ కొత్తగా ఇచ్చేది ఏంటి అని హరీశ్ రావు నిలదీశారు. విభజన చట్టంలో తొమ్మిదేళ క్రితమే పొందుపర్చారని చెప్పారు. తొమ్మిదేళ్ల నుంచి రాకుండా బీజేపీ అడ్డు పడ్డదని అన్నారు. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అంటూ చెవిలో పూలు పెడుతున్నారని అన్నారు. బీజేపీ ఇప్పటికీ మోసం చేయాలని చూస్తోందని చెప్పారు.
మోదీ వచ్చి, ఉత్త మాటలు చెప్పి వెళ్లారని, చిలుక పలుకులు పలికారని హరీశ్ రావు అన్నారు. ఏమి చేసినా బీజేపీ రాష్ట్రంలో బలపడబోదని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు ఎందుకు చేయడం లేదని హరీశ్ రావు అడిగారు. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు.