Malkajgiri Lok Sabha Constituency : ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంపై దేశమంతా ఆసక్తి….మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీల ప్రయత్నాలు
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్.. ఎల్బీనగర్ ! సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయ్. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జి రామ్మోహన్ గౌడ్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది.
Malkajgiri Lok Sabha Constituency : గెలుపు రీసౌండ్ దేశమంతా వినిపించాలని బీఆర్ఎస్ పంతం పట్టిన చోటు.. మోదీ పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతున్న చోటు.. కాంగ్రెస్కు ఆశలు రేపుతోన్న చోటు.. అదే మల్కాజ్గిరి ! ఇక్కడ రాజకీయం అంటే పార్టీల మధ్య యుద్ధమే కాదు.. ఓ ఎమోషన్ ! ఆసియాలోనే అతిపెద్ద నియోజకవర్గం.. దేశమంతా ఆసక్తిగా గమనించే నియోజకవర్గం.. అలాంటి మల్కాజ్గిరిపై సత్తా చాటాలని మూడు పార్టీలు పాచికలు సిద్ధం చేశాయ్. కంటికి కనిపించే ఆప్షన్ ఒక్కటే.. అదే విజయం అనే రేంజ్లో ఆయుధాలకు పదును పెడుతున్నాయ్. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ రాజకీయం ఎలా ఉంది.. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత.. బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతోంది ఏంటి.. బీజేపీకి సరైన అభ్యర్థులు ఉన్నారా.. కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా.. ఏ పార్టీ బలం ఏంటి.. బలహీనత ఏంటి.. మల్కాజ్గిరి రాజకీయ ముఖచిత్రమ్ వినిపిస్తున్న సందేశం ఏంటి..
మల్కాజ్గిరి పార్లమెంట్లో పాగా వేసేది ఎవరు ? మల్కాజ్గిరి మీద పట్టు సాధిస్తే..జంటనగరాలు గ్రిప్లో ఉన్నట్లే ?
ఎన్నికలు వచ్చిన ప్రతీసారి.. దేశ రాజకీయం చర్చకు వచ్చిన ప్రతీసారి.. మల్కాజ్గిరి మాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఇది ! మినీ ఇండియా అంటారు ఈ సెగ్మెంట్ను ! ఇక్కడ కొడితే.. ఆ సౌండ్ ఢిల్లీ వరకు వినిపిస్తుంటుంది. అందుకే పార్టీలన్నీ మల్కాజ్గిరి మీద ప్రత్యేకంగా నజర్ పెడుతుంటాయ్. ఇప్పటివరకు రాజకీయం వేరు.. ఇకపై రాజకీయం వేరు.. దేశ రాజకీయాలను ఏలుదామని రెడీ అవుతున్న బీఆర్ఎస్.. మల్కాజ్గిరి పార్లమెంట్ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుండగా.. మల్కాజ్గిరి నుంచి మోదీ పోటీ చేసే చాన్స్ ఉందని బీజేపీలో ప్రచారం జరుగుతోంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మల్కాజ్గిరి మీద పట్టు సాధిస్తే.. జంటనగరాలు గ్రిప్లో ఉన్నట్లే ! అందుకే గెలుపు కోసం సామదానభేదదండోపాయాలు వాడుతున్నాయ్ పార్టీలు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా రేవంత్ రెడ్డి…బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు..మంత్రి మల్లారెడ్డి పేర్లు పరిశీలన
మల్కాజ్గిరిలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన అసెంబ్లీకే ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి.. ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఆశావహులెవరూ ఇప్పటివరకు కనుచూపు మేరలో లేరు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ.. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. ఐతే ఆయన మరోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని గాంధీభవన్ టాక్. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు.. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పేరు పరిశీలిస్తున్నారు. గులాబీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డితో పాటు.. మంత్రి మల్లారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేరు కూడా వినిపిస్తోంది. మూడు పార్టీలకు మల్కాజ్గిరి విజయం చాలా కీలకం. ఎవరు గెలిచినా ఈ సౌండ్.. ఢిల్లీ వీధుల వరకు వినిపించే అవకాశం ఉంటుంది.
మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయ్. 2018లో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా.. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. ఐతే ఎల్బీనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన సుధీర్రెడ్డి ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
మేడ్చల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి మల్లారెడ్డికి వర్గపోరు…
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి మల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడ్చల్లో పార్టీ విభేదాలు మల్లారెడ్డికి ఇబ్బందిగా మారాయ్. మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. మేడ్చల్ టికెట్ తమకే అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎన్నికల నాటికి ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్నది బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతోంది. కాంగ్రెస్ నుంచి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు.. జంగయ్య యాదవ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ను బలంగా ఢీకొట్టే అభ్యర్థి కోసం బీజేపీ వెతుకుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్రెడ్డి, సీనియర్ నేత మోహన్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా.. బలమైన నేతను చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది.
READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ బరిలోకి దిగే ఛాన్స్…బీజేపీ టికెట్ రేసులో రాంచంద్రరావు
మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి మైనంపల్లి హన్మంతరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కుమారుడు రోహిత్ను బరిలోకి దింపాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ బలంగానే ఉంది. ఐతే కొంతకాలంగా మైనంపల్లి చేస్తున్న అసంతృప్తి వ్యాఖ్యలు.. నియోజకవర్గంలో చర్చకు దారి తీస్తున్నాయ్. దీనికితోడు మల్లారెడ్డితో మైనంపల్లికి ఏ మాత్రం పొసగడం లేదనే ప్రచారం కూడా ఉంది. జిల్లా ఎమ్మెల్యేలంతా మైనంపల్లి ఇంట్లో భేటీ అయి.. మల్లారెడ్డి మీద తిరుగుబాటు బావుటా కూడా ఎగురవేశారు. ఈ వివాదం ప్రస్తుతానికి కూల్ అయినట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున 2014 నుంచి రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ ముఖ్య అనుచరుడు అయిన నందికంటి శ్రీధర్కే టికెట్ దాదాపు కన్ఫార్మ్. పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో శ్రీధర్ ధీమాగా ఉన్నారు.
READ ALSO : Chevella Lok Sabha Constituency : చెమట్లు పట్టిస్తోన్న చేవెళ్ల పార్లమెంట్ రాజకీయం…ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?
ఉప్పల్ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు….బీఆర్ ఎస్ టిక్కెట్ కోసం ట్రయాంగిల్ ఫైట్
ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా భేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు పీక్స్కు చేరింది. ఉప్పల్ టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. భేతి సుభాష్కు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు పోటీ పడుతున్నారు. అటు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరుకున్న బండారి లక్ష్మారెడ్డి కూడా టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఉప్పల్ బీఆర్ఎస్లో ట్రయాంగిల్ టికెట్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కమలం పార్టీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు వీరేందర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయ్. కాంగ్రెస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ కేడర్ ఛిన్నాభిన్నం అయిన పరిస్థితి.
కుత్బుల్లాపూర్ లో బీజేపీ నుంచి పోటీకి సిద్ధం అవుతున్న కూన శ్రీశైలం గౌడ్…బీఆర్ఎస్ టిక్కెట్ తనకేనన్న ధీమాలో వివేకానంద గౌడ్..
పారిశ్రామిక ప్రాంతం అయిన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నుంచి వివేకానంద గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా టికెట్ తనకే అని వివేకా ధీమాగా ఉన్నారు. ఐతే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని ఆశిస్తున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శంభీపూర్ రాజు.. మంత్రి కేటీఆర్కు సన్నిహితుడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఎలాంటి విభేదాలు బయటకు కనిపించకున్నా.. ఎవరికి వారు అలర్ట్గా ఉంటూ కేడర్ను కాపాడుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరి వైపు నిలవాలో తెలియక గులాబీ పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్లో పడుతున్న పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన కూన శ్రీశైలం గౌడ్.. ప్రస్తుతం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ తరఫున పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ కీలక అనుచరుడు నర్సారెడ్డి భూపతి రెడ్డికి టిక్కెట్ ఖాయమనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీపీ కొలను హన్మంత్ రెడ్డి కూడా హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.
READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…
కూకట్పల్లి లో హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో మాధవరం కృష్ణారావు…చెల్లాచెదురు అయిన కాంగ్రెస్ కేడర్
కూకట్పల్లి నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మాధవరం కృష్ణారావు.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్లకే టికెట్ అన్న కేసీఆర్ హామీతో.. మాధవరం మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. టికెట్ ఫైట్లో పెద్దగా పోటీ కూడా లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశం ! 2018లో మహాకూటమిలో భాగంగా కూకట్పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించగా.. కాంగ్రెస్ కేడర్ చెదిరిపోయింది. దీంతో పార్టీ శ్రేణులను గాడిలోకి తీసుకురావడం హస్తం పెద్దలకు ఇబ్బందిగానే మారింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగల్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. కూకట్పల్లి మీద పట్టు సాధించేందుకు కమలం పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన పన్నాల హరీష్ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి.. విక్టరీ కొట్టాలని పన్నాల కసి మీద ఉన్నారు.
READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !
కంటోన్మెంట్ లో సాయన్నకు బదులుగా కొత్త వ్యక్తిని బరిలోకి దింపే ఆలోచనలో బీఆర్ ఎస్….బలమైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషణ
కంటోన్మెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సాయన్న.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వయోభారం కారణంగా సాయన్న ఇబ్బంది పడుతుండడంతో.. గులాబీ పార్టీ తరఫున కొత్త వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు క్రిశాంక్, గజ్జెల నాగేశం, ఎర్రోళ్ల శ్రీనివాస్.. కంటోన్మెంట్ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. అటు సాయన్న కూడా ఈసారి తన కూతురికి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి కోరుతున్నారని టాక్. దీంతో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరిని వరిస్తుందన్నది హాట్టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ నుంచి ఎస్సీ సెల్ చైర్మన్ నాగరి ప్రీతమ్తో పాటు.. పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ కూడా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్లో బలమైన అభ్యర్థి కోసం బీజేపీ సెర్చింగ్ మొదలుపెట్టింది.
ఎల్బీనగర్ బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్న వర్గ విభేదాలు….సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ మధ్య వర్గపోరు….కాంగ్రెస్ నుంచి బరిలో రేవంత్ రెడ్డి
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్.. ఎల్బీనగర్ ! సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయ్. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జి రామ్మోహన్ గౌడ్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే మళ్లీ అవకాశం దక్కుతుందని సుధీర్రెడ్డి అంటుంటే.. వరసుగా మూడుసార్లు ఓడిన రామ్మోహన్ గౌడ్… ఈ సారి ఎలాగైనా అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎల్బీనగర్ బీఆర్ఎస్లో టికెట్ ఫైట్ ఇంట్రస్టింగ్గా కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చాయ్. 11 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. ఐతే కమలం పార్టీ కార్పొరేటర్లు వంగా మధుసూధన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉంటారనే ప్రచారం జరురగుతోంది. రేవంత్ ఆలోచన మార్చుకుంటే.. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో పాటు.. సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి టికెట్ రేసులో ఉంటారు.
READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీలను బలహీనతలు వెంటాడుతున్నాయ్. బీఆర్ఎస్ను వర్గవిభేదాలు వెంటాడుతుంటే.. బలమైన అభ్యర్థులు లేక బీజేపీ, కేడర్ ఛిన్నాభిన్నమై కాంగ్రెస్ ఇబ్బంది పడుతున్నాయ్. ఐతే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బరిలోకి దిగిన పార్టీలు.. బలమైన అభ్యర్థులను వెతకడంలో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయ్. దీంతో మల్కాజ్గిరి ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీలన్నీ నేషనల్ లెవల్ ఫైట్కు సిద్ధం అవుతున్న వేళ.. నేషన్వైడ్ హాట్టాపిక్ అయిన మల్కాజ్గిరిలో సత్తా చాటేది ఎవరు అనే చర్చ జనాల్లో జోరుగా సాగుతోంది.