కవిత వల్ల ఇద్దరు సీఎంలు ఓడిపోయారు.. ఒక సీఎం జైలుకి వెళ్లారు: మల్లు రవి
కవిత అవినీతికి పరాకాష్ఠ అని, ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ నేత మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. కవిత వల్ల ఇద్దరు సీఎంలు ఓడిపోయారని, ఒక సీఎం జైలుకి వెళ్లారని అన్నారు. కవిత వల్ల ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిందని చెప్పారు.
కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చాలా రోజుల వరకు బెయిల్ కూడా రాలేదని అన్నారు. కవిత ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని అన్నారని, మరి అదే పార్టీలో ఆమె కూడా ఉన్నారు కదా అని ఎద్దేవా చేశారు. కవిత అవినీతికి పరాకాష్ఠ అని, ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
కాగా, కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందని కవిత ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలంటూ అబిడ్స్ జీపీవో వద్ద పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు.
అప్పు కావాలంటూ ఆర్ఏసీ సంస్థకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారని, ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని అన్నారు. తెలంగాణ ఆదాయం ఎక్కడకి పోతుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.